Arca da aliança
A Arca da Aliança era o símbolo mais sagrado de Israel — representava a presença de Deus no meio do seu povo. Sobre ela brilhava a glória do Senhor entre os querubins.
నిబంధన మందసం
వారు తుమ్మకర్రతో ఒక మందసం చెయ్యాలి. దాని పొడవు రెండు మూరలున్నర, దాని వెడల్పు మూరెడున్నర, దాని ఎత్తు మూరెడున్నర దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగించాలి. లోపలా బయటా దానికి బంగారు రేకు పొదిగించాలి. దాని మీద బంగారు అంచు కట్టాలి. దానికి నాలుగు బంగారు రింగులు పోత పోసి, ఒక వైపు రెండు, మరొక వైపు రెండు రింగులు ఉండేలా దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించాలి.
తుమ్మ చెక్కతో మోతకర్రలు చేసి వాటికి బంగారు రేకు పొదిగించి వాటితో ఆ మందసాన్ని మోయడానికి అంచులకు ఉన్న రింగుల్లో ఆ మోతకర్రలను దూర్చాలి. ఆ మోతకర్రలు ఆ మందసం రింగుల్లోనే ఉండాలి. వాటిని రింగుల్లోనుండి తీయకూడదు. ఆ మందసంలో నేను నీకివ్వబోయే శాసనాలను ఉంచాలి.
నీవు మేలిమి బంగారంతో ప్రాయశ్చిత్త స్థానమైన మూతను చెయ్యాలి. దాని పొడవు రెండు మూరలున్నర. దాని వెడల్పు మూరెడున్నర. సాగగొట్టిన బంగారంతో రెండు బంగారు కెరూబు రూపాలను చెయ్యాలి. ప్రాయశ్చిత్త మూత రెండు అంచులతో వాటిని ఏకాండంగా చెయ్యాలి. ఈ కొనలో ఒక కెరూబును ఆ కొనలో ఒక కెరూబును చెయ్యాలి. ప్రాయశ్చిత్త మూతపై దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏకాండంగా చెయ్యాలి. ఆ కెరూబులు రెక్కలు పైకి విచ్చుకుని ప్రాయశ్చిత్త మూతను తమ రెక్కలతో కప్పుతూ ఉండాలి. వాటి ముఖాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండాలి. ఆ కెరూబుల ముఖాలు ప్రాయశ్చిత్త మూత వైపుకి తిరిగి ఉండాలి. నీవు ఆ మూతను మందసం మీద ఉంచాలి. నేను నీకిచ్చే శాసనాలను ఆ మందసంలో ఉంచాలి.
అక్కడ నేను నిన్ను కలుసుకుని ప్రాయశ్చిత్త మూత మీద నుండి, శాసనాలున్న మందసం మీద ఉన్న రెండు కెరూబుల మధ్య నుండి, ఇశ్రాయేలీయుల కోసం ఇచ్చే ఆజ్ఞలన్నిటినీ నీకు తెలియజేస్తాను.
నిబంధన మందసం తయారీ
బెసలేలు తుమ్మకర్రతో మందసాన్ని తయారుచేశాడు. దాని పొడవు రెండు మూరలు, దాని వెడల్పు, ఎత్తు మూరన్నర,
సన్నిధి గుడారం గురించిన అంతిమ ఆదేశాలు
యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. "మొదటి నెల మొదటి రోజున నువ్వు సన్నిధి గుడారం ఉన్న మందిరాన్ని నిలబెట్టాలి. అక్కడ శాసనాల పెట్టెను నిలబెట్టి దాన్ని అడ్డ తెరతో మూసి ఉంచాలి.
యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టు శాసనాలను మందసంలో ఉంచాడు. మందసాన్ని మోసే కర్రలను పెట్టెకు దూర్చి దానిపైన కరుణా స్థానం మూత ఉంచాడు. మందసాన్ని యెహోవా మందిరంలోకి తెచ్చి అడ్డతెర వేలాడదీసి శాసనాల పెట్టెను కప్పాడు.
యెహోవాతో మాట్లాడడానికి మోషే సన్నిధి గుడారంలోకి వెళ్ళినప్పుడు అతడు దేవుని స్వరం తనతో మాట్లాడడం విన్నాడు. నిబంధన మందసం శాసనాల పెట్టె పైన ఉన్న పరిహార స్థానం నుండి ఇద్దరు కెరూబుల మధ్యలోనుండి దేవుడు అతనితో మాట్లాడాడు. యెహోవా అతనితో మాట్లాడాడు.
వారు యెహోవా కొండ దగ్గర నుండి మూడు రోజులు ప్రయాణం చేశారు. వారి విశ్రాంతి స్థలం కోసం చేసిన మూడు రోజుల ప్రయాణంలో యెహోవా నిబంధన శాసనాల పెట్టె వాళ్లకి ముందుగా కదిలింది. వారు తాము మజిలీ చేసిన స్థలం నుండి ప్రయాణం చేసినప్పుడు యెహోవా మేఘం పగటివేళ వారి మీద ఉంది.
నిబంధన పెట్టె ప్రయాణం కోసం లేచినప్పుడల్లా మోషే "యెహోవా, లే, నీ శత్రువులను చెదరగొట్టు. నిన్ను ద్వేషించే వారిని నీ ఎదుటనుండి తరిమి కొట్టు" అనేవాడు. నిబంధన పెట్టె ఆగినప్పుడు మోషే "యెహోవా లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి తిరిగి రా" అనేవాడు.
అహరోను చేతికర్ర చిగిర్చడం
యెహోవా మోషేతో మాట్లాడుతూ, "నువ్వు ఇశ్రాయేలీయులతో మాట్లాడు, వారి దగ్గర ఒక్కొక్క పితరుల వంశానికి ఒక్కొక్క చేతికర్ర చొప్పున, అంటే ప్రతి వంశానికి చెందిన వారి నాయకుని దగ్గరనుంచి తమ తమ వంశాల ప్రకారం 12 చేతికర్రలు తీసుకుని ఎవరి చేతికర్ర మీద వారి పేరు రాయి.
లేవీ చేతికర్ర మీద అహరోను పేరు రాయాలి. ఎందుకంటే ఒక్కొక్క పితరుల వంశాల నాయకునికి ఒక్క చేతికర్రే ఉండాలి. నేను మిమ్మల్ని కలుసుకునే సన్నిధి గుడారంలోని నిబంధన శాసనాల ముందు వాటిని ఉంచాలి. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుంటానో, అతని కర్ర చిగురిస్తుంది. ఇశ్రాయేలీయులు మీకు విరోధంగా చేస్తున్న ఫిర్యాదులు నాకు వినిపించకుండా ఆపేస్తాను" అన్నాడు.
కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పినప్పుడు వారి నాయకులందరూ తమ తమ పితరుల వంశాల్లో ఒక్కొక్క నాయకునికి ఒక్కొక్క కర్ర ప్రకారం 12 కర్రలు అతనికిచ్చారు. అహరోను కర్ర కూడా వారి కర్రల మధ్యలో ఉంది. మోషే, వారి కర్రలను నిబంధన శాసనాల గుడారంలో యెహోవా సన్నిధిలో పెట్టాడు.
తరువాత రోజు మోషే నిబంధన శాసనాల గుడారంలోకి వెళ్లి చూసినప్పుడు లేవీ వంశానికి చెందిన అహరోను కర్ర మొగ్గ తొడిగి ఉంది. అది మొగ్గలు తొడిగి, పూలు పూసి, పండిన బాదం కాయలు కాసింది. మోషే యెహోవా సన్నిధిలోనుంచి ఆ కర్రలన్నీ ఇశ్రాయేలీయులందరి ఎదుటకు తెచ్చినప్పుడు వారు వాటిని చూసి ఒక్కొక్కరూ ఎవరి కర్ర వారు తీసుకున్నారు.
అప్పుడు యెహోవా మోషేతో "అహరోను కర్రను నిబంధన శాసనాల ఎదుట శాశ్వతంగా ఉంచు. అలా చేస్తే, అది తిరుగుబాటు చేసిన వారి అపరాధానికి గుర్తుగానూ, నాకు విరోధంగా సణిగి ఎవ్వరూ చనిపోకుండా ఉండడానికీ వీలౌతుంది" అన్నాడు. అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు, అతడు కచ్చితంగా అలాగే చేశాడు.
కోతకాలమంతా యొర్దాను దాని గట్లన్నిటి మీదా పొర్లి పారుతుంది. నిబంధన మందసాన్ని మోసే యాజకులు ప్రజలకు ముందు వెళ్లగా యొర్దాను దాటడానికి ప్రజలు తమ గుడారాల్లో నుండి బయలుదేరారు. అప్పుడు ఆ మందసాన్ని మోసే యాజకులు యొర్దానులో దిగిన తరువాత వారి కాళ్లు నీటి అంచున మునగగానే పై నుండి పారే నీళ్లు చాలా దూరంగా సారెతాను దగ్గర ఉన్న ఆదాము అనే పట్టణం దగ్గర ఏకరాశిగా నిలిచిపోయాయి. ఉప్పు సముద్రం అనే అరాబా సముద్రానికి ప్రవహించే నీళ్ళు పూర్తిగా ఆగిపోయాయి. ప్రజలు యెరికో దగ్గర ఆవలి తీరం చేరారు. ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద యొర్దాను దాటడం అయ్యే వరకూ యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకులు యొర్దాను నది మధ్యలో ఆరిన నేల మీద నిలబడ్డారు.
యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకులు యొర్దాను మధ్యలో నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరికాళ్లు పొడి నేల మీద నిలబడగానే యొర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటిలాగే తమ చోటికి మళ్ళి దాని గట్లన్నిటి మీదా పొర్లి ప్రవహించాయి.
ఆ రోజుల్లో ఇశ్రాయేలీయుల భయం వల్ల ఎవ్వరూ బయటికి వెళ్ళకుండా, లోపలికి రాకుండా యెరికో పట్టణ ద్వారం గట్టిగా మూసివేశారు.
అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు. "చూడూ, నేను యెరికోను దాని రాజును అందులోని పరాక్రమశాలురను నీ చేతికి అప్పగిస్తున్నాను. మీరంతా యుద్ధసన్నద్ధులై పట్టణం చుట్టూ ఒకసారి తిరగాలి. అలా ఆరు రోజులు చేయాలి. ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకుని ముందుగా నడవాలి. ఏడవ రోజున మీరు ఏడుసార్లు పట్టణం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ యాజకులు బూరలు ఊదాలి. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేస్తూండగా మీరు ఆ బూరల ధ్వని విన్నప్పుడు ప్రజలందరూ ఆర్భాటంగా కేకలు వేయాలి, అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలిపోతుంది. యోధులు ప్రతి ఒక్కరూ ఎవరి ముందు వారు చక్కగా ఎక్కుతూ దాని మీద దాడి చెయ్యాలి" అన్నాడు.
నూను కుమారుడు యెహోషువ యాజకులను పిలిపించి "మీరు నిబంధన మందసాన్ని ఎత్తుకుని మోయండి. ఏడుగురు యాజకులు యెహోవా మందసానికి ముందుగా ఏడు పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకుని నడవాలి" అని వారితో చెప్పాడు. తరువాత అతడు "మీరు ముందుకు వెళ్ళి పట్టణం చుట్టూ ముట్టడి వేయండి, యోధులు యెహోవా మందసానికి ముందుగా నడవండి" అని ప్రజలతో చెప్పాడు.
యాజకులు బూరలు ఊదగానే ప్రజలు కేకలు వేశారు. ఆ బూరల శబ్దం విన్నప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేసినపుడు ఆ ప్రాకారం కూలిపోయింది. ప్రజలంతా నేరుగా చక్కగా ఆ ప్రాకారం ఎక్కి పట్టణాన్ని పట్టుకున్నారు.
ఫిలిష్తీయులు బారులు తీరి నిలబడి ఇశ్రాయేలీయులపై యుద్ధం చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయి యుద్ధభూమిలోనే దాదాపు నాలుగు వేలమంది మరణించారు.
ప్రజలు ఊరికి తిరిగి వచ్చాక ఇశ్రాయేలీయుల పెద్దలు "యెహోవా ఈ రోజు ఎందుకు మనలను ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయేలా చేశాడు? షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసాన్ని తీసుకొచ్చి మన మధ్యనే ఉంచుకుందాము. అది మన మధ్య ఉంటే మనలను శత్రువుల చేతిలో నుండి కాపాడుతుంది" అన్నారు.
కాబట్టి పెద్దలు కొందరిని షిలోహుకు పంపించి అక్కడనుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్న సైన్యాలకు అధిపతి యెహోవా నిబంధన మందసాన్ని తెప్పించారు. ఏలీ ఇద్దరు కుమారులు హొఫ్నీ, ఫీనెహాసు కూడా అక్కడే దేవుని నిబంధన మందసం దగ్గర ఉన్నారు.
యెహోవా నిబంధన మందసాన్ని ప్రజల మధ్యకు తెచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా భూమి దద్దరిల్లి పోయేలా కేకలు వేశారు. ఫిలిష్తీయులు ఆ కేకలు విని, హెబ్రీయుల గుంపులో ఈ గొప్ప కేకలు ఏమిటో అని ఆరా తీసి, యెహోవా నిబంధన మందసాన్ని శిబిరంలోకి తెచ్చారని తెలుసుకున్నారు.
వారు భయపడి, దేవుడు శిబిరంలోకి వచ్చాడనుకుని "అయ్యో, ఇక మనకి మూడింది. ఇలాంటిది ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు, అయ్యో, మహాశూరుడైన ఈ దేవుడి చేతిలోనుండి మనలను ఎవరు విడిపిస్తారు? అరణ్యంలో రకరకాల తెగుళ్ళు రప్పించి ఐగుప్తు వారిని సంహరించిన దేవుడు ఈయనే గదా. ఫిలిష్తీయులారా, వారు మన ముందు ఓడిపోయి దాసులు అయినట్టు మనం ఈ హెబ్రీయులకి దాసులు కాకూడదు. మనమంతా ధైర్యంగా నిలబడి బలం తెచ్చుకుని యుద్ధం చేద్దాం" అని చెప్పుకున్నారు.
ఫిలిష్తీయులు యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ పారిపోయి తమ డేరాలకు తిరిగి వచ్చారు. అప్పుడు భయంకరమైన వధ జరిగింది. ఇశ్రాయేలీయుల్లో 30 వేలమంది సైనికులు చనిపోయారు. శత్రువులు దేవుని మందసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఏలీ కొడుకులు హొఫ్నీ, ఫీనెహాసు ఇద్దరినీ చంపేశారు.
యెహోవా హస్తం అష్డోదు వారిపై బహు భారంగా ఉంది. అష్డోదులో, దాని సరిహద్దుల్లో ఉన్నవారికి ఆయన తీవ్రమైన గడ్డలు రప్పించి వారిని చంపివేశాడు. అష్డోదు ప్రజలు జరిగింది చూసి "ఇశ్రాయేలీయుల దేవుని మందసం మన మధ్య ఉండ కూడదు. ఎందుకంటే ఆయన హస్తం మనమీదా, మన దేవుడు దాగోను మీదా తీవ్రంగా ఉంది." అని చెప్పుకున్నారు.
కాబట్టి వారు ఫిలిష్తీయుల నాయకులందరినీ పిలిపించి "ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని మనం ఏమి చేద్దాం?" అని అడిగారు. అందుకు పెద్దలు "ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని ఇక్కడనుండి గాతు పట్టణానికి పంపించండి" అని చెప్పారు. అప్పుడు వారు ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని అక్కడనుండి గాతుకు తీసుకు వెళ్లారు. వారు అష్డోదు నుండి గాతుకు దాన్ని మోసుకు పోయిన తరువాత యెహోవా హస్తం గాతులో పెద్ద కలవరం పుట్టించింది. ఆయన పెద్దలకు, పిల్లలకు వినాశం కలిగించాడు. వారి దేహాలపై గడ్డలు వచ్చాయి.
వెంటనే వారు దేవుని మందసాన్ని ఎక్రోనుకు పంపివేశారు. దేవుని మందసం ఎక్రోనులోకి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి "మనలనూ మన ప్రజలనూ చంపివేయాలని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని మన దగ్గరికి తీసుకువచ్చారు" అన్నారు.
అప్పుడు ప్రజలు ఫిలిష్తీయుల పెద్దలను పిలిపించి "ఇశ్రాయేలీయుల దేవుని మందసం మనలను మన ప్రజలను చంపకుండా ఉండేలా దాన్ని దాని స్వస్థలానికి పంపించండి" అని చెప్పారు. దేవుని హస్తం శిక్ష అక్కడ ఎంతో భారంగా ఉంది. అందువల్ల మరణ భయం ఆ పట్టణం వారందరినీ అల్లకల్లోలం చేసింది.
మందసం ఇశ్రాయేలీయుల వద్దకు తిరిగి రావడం
యెహోవా మందసం ఏడు నెలలపాటు ఫిలిష్తీయుల దేశంలో ఉంది. ఫిలిష్తీయులు యాజకులనూ శకునం చూసేవారిని పిలిపించి "యెహోవా మందసాన్ని ఏం చేద్దాం? అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడకి పంపడానికి ఏమి చేయాలో చెప్పండి" అని అడిగారు. అందుకు వారు, "ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని పంపివేసే పక్షంలో ఉచితంగా పంపవద్దు. ఎలాగైనా ఆయనకు అపరాధ పరిహారం అర్పణంగా చెల్లించి పంపాలి. అప్పుడు మీరు బాగుపడి ఆయన కోపం మీ మీద నుండి ఇప్పటిదాకా ఎందుకు తొలగి పోలేదో తెలుసుకుంటారు" అని జవాబిచ్చారు.
ఆ విధంగా వారు రెండు పాడి ఆవులను తోలుకువచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంట్లో ఉంచి యెహోవా మందసాన్ని, బంగారు గడ్డల రూపాలూ పందికొక్కు రూపాలూ ఉన్న ఆ చిన్న పెట్టెను బండిమీద పెట్టారు. ఆ ఆవులు రహదారి వెంబడి సాఫీగా వెళ్తూ, రంకెలు వేస్తూ, బేత్షెమెషుకు వెళ్లే దారిలో నడిచాయి. ఫిలిష్తీయుల పెద్దలు వాటిని వెంబడిస్తూ బేత్షెమెషు సరిహద్దు వరకూ వెళ్లారు.
బేత్షెమెషు ప్రజలు పొలంలో తమ గోదుమ పంట కోస్తున్నారు. వారు కన్నులెత్తి చూసినప్పుడు మందసం కనబడింది. దాన్ని చూసి వారు సంతోషించారు. ఆ బండి బేత్షెమెషుకు చెందిన యెహోషువ అనే వాడి పొలంలోకి వచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద రాయి దగ్గర నిలిచింది. వారు బండికి ఉన్న కర్రలను నరికి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించారు.
లేవీయులు యెహోవా మందసాన్ని, బంగారపు వస్తువులు ఉన్న ఆ చిన్న పెట్టెను కిందికి దించి ఆ పెద్ద రాతిమీద పెట్టినప్పుడు ఆ రోజు బేత్షెమెషు ప్రజలు యెహోవాకు దహనబలులు చేసి బలులు అర్పించారు.
అప్పుడు కిర్యత్యారీము ప్రజలు వచ్చి యెహోవా మందసాన్ని తీసుకువెళ్ళి గిబియాలో కొండపై ఉన్న అబీనాదాబు ఇంటి దగ్గర ఉంచి దాన్ని కాపాడడం కోసం అతని కొడుకు ఎలియాజరును నియమించారు.
మందసాన్ని కిర్యత్యారీములో ఉంచి ఇరవై ఏళ్లు నిండాయి. ఇశ్రాయేలీయులంతా యెహోవాను అనుసరించాలని కోరుతూ చింతిస్తున్నారు.
దేవుని మందసం ఓబేదెదోము ఇంట్లో ఉండడం వల్ల యెహోవా ఓబేదెదోముకూ, అతని కుటుంబానికీ ఉన్నదానినంతా విస్తారంగా అభివృద్ధి చెందిస్తున్నాడన్న సంగతి దావీదుకు తెలిసింది. కాబట్టి దావీదు వెళ్లి ఓబేదెదోము ఇంట్లో ఉన్న దేవుని మందసాన్ని దావీదు పట్టణానికి ఊరేగింపుగా తీసికువచ్చాడు. ఎలాగంటే, యెహోవా మందసాన్ని మోసేవారు ఆరు అడుగులు ముందుకు నడచినప్పుడల్లా ఒక ఎద్దును, ఒక కొవ్విన దూడను వధించారు, దావీదు నారతో నేసిన ఏఫోదును ధరించి పరమానందంగా యెహోవా సన్నిధిలో పరవశించి నాట్యం చేశాడు. ఈ విధంగా దావీదు, ఇశ్రాయేలీయులంతా ఉత్సాహంగా తంతి వాయిద్యాలు వాయిస్తూ యెహోవా మందసాన్ని తీసుకు వచ్చారు.
మందసాన్ని దేవాలయానికి తీసుకోని రావడం
తరవాత సీయోను అనే దావీదుపురం నుండి యెహోవా నిబంధన మందసాన్ని తీసుకు రావడానికి సొలొమోను రాజు ఇశ్రాయేలీయుల పెద్దలనూ గోత్రాల నాయకులనూ, అంటే ఇశ్రాయేలీయుల పూర్వీకుల కుటుంబాల పెద్దలను యెరూషలేములో తన దగ్గరకి పిలిపించాడు. కాబట్టి ఇశ్రాయేలీయులంతా ఏతనీము అనే ఏడో నెలలో పండగ కాలంలో సొలొమోను రాజు దగ్గర సమావేశమయ్యారు. ఇశ్రాయేలీయుల పెద్దలంతా వచ్చినప్పుడు యాజకులు యెహోవా మందసాన్ని పైకెత్తుకున్నారు. ప్రత్యక్ష గుడారాన్ని, గుడారంలో ఉన్న పరిశుద్ధ సామగ్రిని యాజకులు, లేవీయులు తీసుకు వచ్చారు.
సొలొమోను రాజు, అతని దగ్గర సమావేశమైన ఇశ్రాయేలు సమాజమంతా మందసం ఎదుట నిలబడి, లెక్క పెట్టలేనన్ని గొర్రెలనూ ఎద్దులనూ బలిగా అర్పించారు. యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని దాని స్థలంలో, అంటే మందిరం గర్భాలయమైన అతి పరిశుద్ధ స్థలం లో, కెరూబుల రెక్కల కింద ఉంచారు. కెరూబుల రెక్కలు మందసం మీదికి చాపుకుని ఉన్నాయి. ఆ కెరూబులు మందసాన్ని, దాని మోత కర్రలనీ కమ్ముకుని ఉన్నాయి. ఆ మోత కర్రల కొనలు గర్భాలయం ఎదుట పరిశుద్ధ స్థలం లోకి కనబడేటంత పొడవుగా ఉన్నప్పటికీ అవి బయటికి కనబడలేదు. అవి ఈ రోజు వరకూ అక్కడే ఉన్నాయి.
ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన తరవాత యెహోవా వారితో నిబంధన చేసినపుడు హోరేబులో మోషే ఆ పలకలను మందసంలో ఉంచాడు. దానిలో ఆ రెండు రాతిపలకలు తప్ప మరేమీ లేవు. యాజకులు పరిశుద్ధ స్థలం లో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘం యెహోవా మందిరాన్ని నింపింది. కాబట్టి యెహోవా మహిమ తేజస్సు ఆయన మందిరంలో నిండిపోయి ఆ మేఘం వలన యాజకులు సేవ చేయడానికి నిలబడ లేకపోయారు.
చెడిపోయిన పిల్లలారా, తిరిగి రండి, నేను మీ యజమానిని. ఇదే యెహోవా వాక్కు
ఒక్కొక్క ఊరిలోనుండి ఒకణ్ణి, ఒక్కొక్క వంశం లోనుండి ఇద్దరినీ, సీయోనుకు తీసుకొస్తాను.
నాకిష్టమైన కాపరులను మీపైన నియమిస్తాను, వారు జ్ఞానంతో, వివేకంతో మిమ్మల్ని పాలిస్తారు.
ఆ రోజుల్లో మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరిస్తూ ఉన్నప్పుడు ప్రజలు యెహోవా నిబంధన మందసం గురించి మాట్లాడరు. అది వారి మనస్సుకు తట్టదు. దాన్ని జ్ఞాపకం చేసుకోరు. అది లేనందుకు బాధపడరు, ఇక ముందు దాన్ని తయారు చేయరు. ఇదే యెహోవా వాక్కు.
పాత నిబంధన నియమాలు, మందిరం కేవలం సాదృశ్యరూపాలే
మొదటి ఒప్పందానికి కూడా భూమి మీద ఒక ఆరాధనా స్థలమూ, ఆరాధనకు సంబంధించిన నియమాలూ ఉన్నాయి. ఇది ఎలాగంటే, ప్రత్యక్ష గుడారంలో ఒక గదిని సిద్ధం చేశారు. ఇది వెలుపలి గది. దీనిలో ఒక బల్ల, సన్నిధిలో ఉంచే రొట్టెలు ఉంచారు. దీనినే పరిశుద్ధ స్థలం అని పిలిచారు.
ఇక రెండవ తెర వెనుక మరో గది ఉంది. దీన్ని అతి పరిశుద్ధ స్థలం అని పిలిచారు. అందులో బంగారంతో చేసిన సాంబ్రాణి పళ్ళెం ఉంది. ఇక్కడ ఇంకా, బంగారం తొడుగు ఉన్న నిబంధన మందసం కూడా ఉంది. ఆ పెట్టెలో ఒక బంగారు పాత్ర, ఆ పాత్రలో మన్నా ఉంది. ఇంకా ఆ పెట్టెలో చిగిరించిన అహరోను కర్ర, నిబంధనకు సంబంధించిన రెండు రాతి పలకలు ఉన్నాయి.
"కరుణా పీఠం" అని పిలిచే మందసం మూతను కప్పుతూ తేజస్సుతో నిండిన కెరూబుల ఆకృతులున్నాయి. వాటిని గూర్చి ఇప్పుడు వివరించడం సాధ్యం కాదు.
అప్పుడు పరలోకంలో దేవుని ఆలయం తెరుచుకుంది. దేవుని నిబంధన మందసం అందులో కనిపించింది. అప్పుడు మెరుపులూ, గొప్ప శబ్దాలూ, ఉరుములూ, భూకంపమూ కలిగాయి. పెద్ద వడగళ్ళు పడ్డాయి.