Arca da aliança
A Arca da Aliança era o símbolo mais sagrado de Israel — representava a presença de Deus no meio do seu povo. Sobre ela brilhava a glória do Senhor entre os querubins.
"వారు తుమ్మకర్రతో మందసం తయారుచేయాలి. దాని పొడవు రెండున్నర మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర, ఎత్తు ఒకటిన్నర మూర ఉండాలి. వచనంలో కూడ లోపల, బయట స్వచ్ఛమైన బంగారంతో పొదిగించి దాని చుట్టూ బంగారు అంచును తయారుచేయాలి. నాలుగు బంగారు ఉంగరాలు పోతపోయించి ఒకవైపు రెండు మరోవైపు రెండు ఉండేలా దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించాలి. తర్వాత తుమ్మకర్రతో మోతకర్రలు చేసి వాటిని బంగారంతో పొదిగించాలి. మందసాన్ని మోయడానికి ఆ మోతకర్రలను మందసానికి ఇరుప్రక్కల ఉన్న ఉంగరాల్లో దూర్చాలి. ఈ మందసపు ఉంగరాల్లో మోతకర్రలు అలాగే ఉండాలి; వాటిని తీసివేయకూడదు. అప్పుడు నేను మీకు ఇచ్చే ఒడంబడిక పలకలను మందసంలో ఉంచండి.
"స్వచ్ఛమైన బంగారంతో ప్రాయశ్చిత్త మూతను తయారుచేయాలి; దాని పొడవు రెండున్నర మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర ఉండాలి. తర్వాత సాగగొట్టిన బంగారంతో మూత చివర్లలో రెండు కెరూబులను తయారుచేయాలి. ఒక చివర ఒక కెరూబును మరోచివర రెండవ కెరూబును చేయాలి; మూత మీద దాని రెండు చివర్లలో కెరూబులతో పాటు దానంతటిని ఒకే ముక్కలా చేయాలి. ఆ కెరూబులు తమ రెక్కలను పైకి చాపి వాటితో ప్రాయశ్చిత్త మూతను కప్పుతూ ఉండాలి. కెరూబుల ముఖాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండి ఆ కెరూబుల ముఖాలు ప్రాయశ్చిత్త మూతను చూస్తున్నట్లుగా ఉండాలి. ప్రాయశ్చిత్త మూతను పైకెత్తి మందసం మీద ఉంచి మందసంలో నేను మీకిచ్చే ఒడంబడిక పలకలను పెట్టాలి.
అక్కడ, నిబంధన మందసం పైన ఉన్న ఆ ప్రాయశ్చిత్త మూత మీదుగా రెండు కెరూబుల మధ్యలో నుండి, నేను నిన్ను కలుసుకొని ఇశ్రాయేలీయుల కోసం నా ఆజ్ఞలన్నిటిని నీకు ఇస్తాను.
బెసలేలు తుమ్మకర్రతో మందసం తయారుచేశాడు. దాని పొడవు రెండున్నర మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర, ఎత్తు ఒకటిన్నర మూర. వచనంలో కూడా
యెహోవా మోషేతో ఇలా అన్నారు: "మొదటి నెల మొదటి రోజున సమావేశ గుడారాన్ని నిలబెట్టాలి. దానిలో నిబంధన మందసాన్ని ఉంచి ఆ మందసాన్ని తెరతో కప్పాలి.
అతడు నిబంధన పలకలను తీసుకుని మందసంలో పెట్టి, మందసానికి మోతకర్రలు దూర్చి దాని మీద ప్రాయశ్చిత్త మూతను ఉంచాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మోషే మందసాన్ని సమావేశ గుడారంలోకి తీసుకువచ్చి కప్పివుంచే తెర తగిలించి నిబంధన మందసాన్ని కప్పాడు.
యెహోవాతో మాట్లాడటానికి మోషే సమావేశ గుడారంలో ప్రవేశించినప్పుడు, నిబంధన మందసం పైనున్న ప్రాయశ్చిత్త మూత మీదుగా ఉన్న రెండు కెరూబుల మధ్య నుండి అతనితో మాట్లాడటం అతనికి వినిపించింది. ఇలా యెహోవా అతనితో మాట్లాడారు.
కాబట్టి వారు యెహోవా పర్వతం నుండి బయలుదేరి మూడు రోజులు ప్రయాణించారు. వారి విశ్రాంతి స్థలం కోసం ఈ మూడు రోజులు యెహోవా నిబంధన మందసం వారికి ముందుగా వెళ్లింది. వారు ప్రయాణం మొదలుపెట్టినప్పుడు యెహోవా మేఘము పగలు వారి మీద ఉంది.
మందసం ఎప్పుడు బయలుదేరుతుందో అప్పుడు మోషే బిగ్గరగా,
"యెహోవా, లేవండి!
మీ శత్రువులు చెదిరిపోవుదురు గాక;
మీ ఎదుట నుండి మీ శత్రువులు పారిపోవుదురు గాక"
అని అనేవాడు.
మందసం ఆగినప్పుడు, అతడు,
"యెహోవా, లెక్కలేనంతగా ఉన్న
వేలాది ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు తిరిగి రండి"
అని అనేవాడు.
యెహోవా మోషేతో అన్నారు, "ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారి పూర్వికుల గోత్రాల ఒక్కొక్క నాయకుడి నుండి ఒకటి చొప్పున కర్రలను తెప్పించు. ప్రతి వ్యక్తి పేరు అతని కర్రపై వ్రాయాలి. లేవీ కర్రపై అహరోను పేరు వ్రాయాలి, ఎందుకంటే ప్రతి పూర్వికుల గోత్ర నాయకునికి ఒక కర్ర ఉండాలి. సమావేశ గుడారంలో నేను మీతో కలిసే నిబంధన మందసం ఎదుట ఈ కర్రలను పెట్టు. నేను ఎన్నుకున్న నాయకుడి కర్ర చిగురిస్తుంది, నీకు విరోధంగా ఇశ్రాయేలీయుల నుండి ఎప్పుడు వచ్చే సణుగుళ్లను ముగిస్తాను."
కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో మాట్లాడాడు, పూర్వికుల వంశాల క్రమం ప్రకారం ఒక్కొక్క నాయకుడు వారి వారి కర్రను, మొత్తం పన్నెండు కర్రలు ఇచ్చారు. వాటిలో అహరోను కర్ర ఉంది. మోషే ఆ కర్రలను నిబంధన గుడారంలో యెహోవా ఎదుట ఉంచాడు.
మర్నాడు మోషే నిబంధన గుడారంలోకి వెళ్లి చూడగా, వాటిలో లేవీ వంశ ప్రతినిధి యైన అహరోను కర్ర చిగురించి మొగ్గలు తొడిగి, పూలు పూసి, బాదం పండ్లు వచ్చాయి. మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నీ ఇశ్రాయేలీయులందరి దగ్గరకు తెచ్చాడు. వారు వాటిని చూశారు, ప్రతీ నాయకుడు తన కర్రలను తీసుకున్నారు.
యెహోవా మోషేతో, "అహరోను కర్రను తెచ్చి మళ్ళీ నిబంధన మందసం ఎదుట పెట్టు. తిరుగుబాటు చేసినవారికి అది ఒక గుర్తుగా ఉండాలి. నాకు విరోధంగా వారు చేసే సణుగుడుకు ఇది ముగింపు కలిగిస్తుంది, తద్వార వారు చావరు" అని చెప్పారు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లే మోషే చేశాడు.
కాబట్టి యాజకులు ప్రజలకు ముందుగా నిబంధన మందసం మోస్తూ నడుస్తుండగా ప్రజలు వారి శిబిరాల నుండి యొర్దాను దాటడానికి బయలుదేరతారు. కోతకాలమంతా యొర్దాను నది పొంగుతూ ఉంటుంది. మందసాన్ని మోసే యాజకులు యొర్దాను నది దగ్గరకు వచ్చి వారి పాదాలు ఆ నీటికి తగలగానే పైనుండి వచ్చే నీళ్లు ఆగిపోయాయి. ఆ నీళ్లు ఆగిపోయి చాలా దూరంలో సారెతాను ప్రక్కన ఉన్న ఆదాము అనే పట్టణం దగ్గర ఎత్తైన రాశిలా నిలిచిపోయాయి. ఉప్పు సముద్రమనే అరాబా సముద్రం అంటే మృత సముద్రంలోకి ప్రవహించే నీళ్లు పూర్తిగా ఆగిపోయాయి. కాబట్టి ప్రజలు యెరికోకు ఎదురుగా నదిని దాటారు. ఇశ్రాయేలీయులంతా పొడినేల మీద యొర్దాను నది దాటే వరకు యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకులు యొర్దాను నది మధ్యలో పొడినేల మీద నిలబడి ఉన్నారు. ఆ విధంగా ఇశ్రాయేలు జనాంగమంతా పొడినేల మీద యొర్దాను నదిని దాటారు.
యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకులు యొర్దాను మధ్యలో నుండి పైకి వచ్చారు. వారి అరికాళ్ల ఆరిన నేలను తాకగానే యొర్దాను నీరు ఎప్పటిలాగే పొంగుతూ ప్రవహించాయి.
ఇశ్రాయేలీయుల భయంతో యెరికో ద్వారాలు గట్టిగా మూసివేయబడ్డాయి. ఎవరూ బయటకు రావడానికి గాని లోపలికి వెళ్లడానికి గాని లేదు.
అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా చెప్పారు, "చూడు, యెరికోను, దాని రాజును, దానిలో ఉన్న యుద్ధవీరులతో పాటు మీ చేతికి అప్పగిస్తున్నాను. నీవు యుద్ధవీరులందరితో పట్టణం చుట్టూ ఒకసారి తిరగాలి. ఇలా ఆరు రోజులు చేయాలి. మందసం ముందు ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకుని నడవాలి. ఏడవ రోజున యాజకులు బూరలు ఊదుతూ పట్టణం చుట్టూ ఏడుసార్లు తిరగాలి. వారు మానకుండా చేస్తున్న బూరధ్వని మీరు విన్నప్పుడు, సైన్యమంతా పెద్దగా కేకలు వేయాలి; అప్పుడు ఆ పట్టణపు గోడ కూలిపోతుంది, సైన్యంలో ప్రతి ఒక్కరు పైకి ఎక్కి నేరుగా లోపలికి వెళ్తారు."
కాబట్టి నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిచి వారితో, "మీరు యెహోవా నిబంధన మందసాన్ని ఎత్తుకుని దాని ముందు ఏడుగురు యాజకులు బూరలు పట్టుకుని నడవాలి" అని ఆజ్ఞ ఇచ్చాడు. తర్వాత అతడు, "పదండి ముందుకు! యెహోవా మందసం ముందు ఆయుధాలు ధరించిన వీరులు నడుస్తుండగా పట్టణం చుట్టూ తిరగాలి" అని ఆజ్ఞ ఇచ్చాడు.
బూరలు ఊదగానే సైన్యం కేకలు వేసింది. బూర శబ్దానికి పురుషులు పెద్దగా అరవడంతో గోడ కూలిపోయింది; కాబట్టి అందరు నేరుగా లోపలికి ప్రవేశించి వారు పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇశ్రాయేలీయుల మీదికి వెళ్లడానికి ఫిలిష్తీయులు తమ బలగాలను మోహరించారు. యుద్ధం ముమ్మరమైనప్పుడు ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలీయులు ఓడిపోయి యుద్ధభూమిలోనే సుమారు నాలుగు వేలమంది మరణించారు. సైనికులు శిబిరం దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు, ఇశ్రాయేలీయుల పెద్దలు, "ఈ రోజు యెహోవా ఫిలిష్తీయుల ముందు ఎందుకు మనలను ఓడిపోయేలా చేశారు? మనం యెహోవా నిబంధన మందసాన్ని షిలోహులో నుండి తీసుకువద్దాం, అప్పుడు ఆయన మనతో వెళ్లి మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షిస్తారు" అని అన్నారు.
కాబట్టి ప్రజలు కొందరిని షిలోహుకు పంపించి అక్కడినుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్న సైన్యాల యెహోవా యొక్క నిబంధన మందసాన్ని తెప్పించారు. దేవుని నిబంధన మందసంతో పాటు ఏలీ యొక్క ఇద్దరు కుమారులైన హొఫ్నీ, ఫీనెహాసు అక్కడే ఉన్నారు.
యెహోవా నిబంధన మందసం శిబిరంలోనికి రాగానే ఇశ్రాయేలీయులందరు భూమి దద్దరిల్లేంత పెద్దగా కేకలు వేశారు. ఆ కేకల ధ్వని ఫిలిష్తీయులు విని, "హెబ్రీయుల శిబిరంలో ఆ పెద్ద కేకలు ఏంటి?" అనుకున్నారు.
యెహోవా నిబంధన మందసం శిబిరంలోనికి వచ్చిందని వారు తెలుసుకొని, ఫిలిష్తీయులు భయపడి, "ఒక దేవుడు శిబిరంలోనికి వచ్చాడు; అయ్యో! ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరుగలేదు. మనకు శ్రమ! బలాఢ్యుడైన ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపిస్తారు? అరణ్యంలో అనేక రకాల తెగుళ్ళతో ఈజిప్టువారిని నాశనం చేసిన దేవుడు ఈయనే. ఫిలిష్తీయులారా, ధైర్యంగా ఉండండి! మగవారిగా ఉండండి, లేదా వారు మీకు బానిసలైనట్టు మీరు హెబ్రీయులకు బానిసలు కాకుండ మగవారిగా బలాఢ్యులై పోరాడండి!" అని చెప్పుకొన్నారు.
కాబట్టి ఫిలిష్తీయులు యుద్ధం చేశారు, ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరు తమ గుడారాలకు పారిపోయారు. అప్పుడు భయంకరమైన వధ జరిగింది; ఇశ్రాయేలీయులలో ముప్పైవేలమంది సైనికులు చనిపోయారు. దేవుని మందసం స్వాధీనం చేసుకోబడింది, ఏలీ ఇద్దరు కుమారులైన హొఫ్నీ, ఫీనెహాసులు చనిపోయారు.
యెహోవా హస్తం అష్డోదు ప్రజల మీద దాని చుట్టుప్రక్కల ప్రాంతాల మీద భారంగా ఉంది; ఆయన వారి పైకి వినాశనం తెచ్చి గడ్డలతో వారిని బాధించారు. అష్డోదు ప్రజలు జరిగిన దానిని చూసి, "ఇశ్రాయేలీయుల దేవుని మందసం మన మధ్య ఉండకూడదు, ఎందుకంటే దానిని బట్టి ఆయన హస్తం మనమీద, మన దేవుడైన దాగోను మీద భారంగా ఉంది" అన్నారు. కాబట్టి వారు ఫిలిష్తీయుల పాలకులందరినీ పిలిచి, "ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని మనం ఏమి చేద్దాం?" అని వారిని అడిగారు.
అందుకు వారు, "ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని ఇక్కడినుండి గాతు పట్టణానికి పంపించండి" అని చెప్పారు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని అక్కడినుండి తీసుకెళ్లారు.
కానీ వారు దానిని తరలించిన తర్వాత, యెహోవా హస్తం ఆ పట్టణానికి వ్యతిరేకంగా ఉండి, వారిని చాలా భయాందోళనలకు గురిచేసింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పట్టణంలోని ప్రజలకు ఆయన గడ్డలు పుట్టించి బాధించారు. కాబట్టి వారు దేవుని మందసాన్ని ఎక్రోనుకు పంపించారు.
దేవుని మందసం ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోను ప్రజలు, "మనలను మన ప్రజలను నాశనం చేయడానికి వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని మన దగ్గరకు తీసుకువచ్చారు" అని కేకలు వేశారు. కాబట్టి వారు ఫిలిష్తీయుల పాలకులందరినీ పిలిచి, "ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని ఇక్కడినుండి పంపివేయండి; దాని చోటికి దానిని పంపివేయండి" అన్నారు. ఎందుకంటే, ఆ పట్టణమంతా భయంతో నిండిపోయింది; దేవుని హస్తం దానిపైన చాలా భారంగా ఉంది.
యెహోవా మందసం ఏడు నెలలు ఫిలిష్తీయుల స్థావరంలో ఉన్న తర్వాత, ఫిలిష్తీయులు యాజకులను, సోదె చెప్పేవారిని పిలిపించి, "మనం యెహోవా మందసం గురించి ఏం చేద్దాం? దాని చోటికి తిరిగి దానిని ఎలా పంపించాలో మాకు చెప్పండి?" అని అడిగారు.
అందుకు వారు, "మీరు ఇశ్రాయేలు దేవుని మందసాన్ని తిరిగి ఇవ్వాలనుకుంటే, బహుమతి లేకుండా ఆయనకు తిరిగి పంపవద్దు; ఆయనకు అపరాధపరిహార అర్పణ పంపాలి. అప్పుడు మీరు స్వస్థత పొందుతారు, ఆయన చేయి మీమీద నుండి ఎందుకు తీసివేయబడలేదో మీకు తెలుస్తుంది" అన్నారు.
కాబట్టి వారు అలాగే చేశారు. రెండు పాడి ఆవులను తోలుకొచ్చి బండికి కట్టి వాటి దూడలను దొడ్డికి పంపి, యెహోవా మందసాన్ని దానితో పాటు బంగారు ఎలుకలు, గడ్డల రూపాలు ఉన్న పెట్టెను వారు బండిపైన పెట్టారు. అప్పుడు ఆ ఆవులు దారిలో తిన్నగా వెళ్తూ, అరుస్తూ తిన్నగా బేత్-షెమెషు దారిలో నడిచాయి; అవి కుడికి గాని ఎడమకు గాని తిరగలేదు. ఫిలిష్తీయుల పాలకులు బేత్-షెమెషు సరిహద్దు వరకు వాటిని వెంబడిస్తూ వెళ్లారు.
బేత్-షెమెషు ప్రజలు లోయలో తమ గోధుమపంటను కోస్తున్నారు. వారు కళ్ళెత్తి చూసినప్పుడు మందసం కనబడింది, వారు దాన్ని చూసి సంతోషించారు. ఆ బండి బేత్-షెమెషుకు చెందిన యెహోషువ పొలంలోనికి వచ్చి, అక్కడ ఉన్న ఒక పెద్ద బండ ప్రక్కన ఆగింది. ప్రజలు ఆ బండి కర్రలను నరికి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించారు. లేవీయులు యెహోవా మందసాన్ని, బంగారపు వస్తువులు ఉన్న ఆ చిన్న పెట్టెను దించి వాటిని ఆ పెద్ద బండ మీద పెట్టారు. ఆ రోజే బేత్-షెమెషు ప్రజలు యెహోవాకు దహనబలులు అర్పించి, బలులు వధించారు.
అప్పుడు కిర్యత్-యారీము ప్రజలు వచ్చి యెహోవా మందసాన్ని తీసుకెళ్లారు. వారు దానిని కొండమీద ఉన్న అబీనాదాబు ఇంటికి తీసుకువచ్చి యెహోవా మందసానికి కాపాడడానికి అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించారు. యెహోవా మందసం కిర్యత్-యారీములో ఇరవై సంవత్సరాలు ఉంది.
ఇశ్రాయేలు ప్రజలంతా మళ్ళీ యెహోవా వైపు తిరిగారు.
"దేవుని మందసం ఇంట్లో ఉండడం వల్ల ఓబేద్-ఎదోము కుటుంబమంతటిని అతనికి ఉన్న వాటినన్నిటిని యెహోవా ఆశీర్వదించారు" అని రాజైన దావీదుకు తెలిసింది. దేవుని మందసాన్ని ఓబేద్-ఎదోము ఇంటి నుండి దావీదు పట్టణానికి ఉత్సాహంతో తీసుకురావడానికి దావీదు వెళ్లాడు. యెహోవా మందసాన్ని మోస్తున్న వ్యక్తులు నడిచేటప్పుడు దావీదు ప్రతి ఆరు అడుగులకు ఒక ఎద్దును, క్రొవ్విన దూడను బలిగా అర్పించాడు. దావీదు సన్నని నారతో నేసిన ఏఫోదును ధరించి తన శక్తంతటితో యెహోవా సన్నిధిలో నాట్యం చేశాడు. ఇలా దావీదు, ఇశ్రాయేలీయులందరు ఆనందోత్సాహాలతో బూరల ధ్వనితో యెహోవా మందసాన్ని తీసుకువచ్చారు.
అప్పుడు రాజైన సొలొమోను దావీదు పట్టణమైన సీయోను నుండి యెహోవా నిబంధన మందసాన్ని తీసుకురావడానికి ఇశ్రాయేలు పెద్దలను, గోత్రాల పెద్దలను, ఇశ్రాయేలీయుల కుటుంబాల నాయకులందరిని యెరూషలేములో తన దగ్గరకు పిలిపించాడు. ఏతనీము అనే ఏడవ నెలలో, పండుగ సమయంలో ఇశ్రాయేలీయులందరు రాజైన సొలొమోను ఎదుట సమావేశమయ్యారు.
ఇశ్రాయేలు పెద్దలందరు వచ్చాక, యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని తీసుకుని, వారు యెహోవా మందసాన్ని, సమావేశ గుడారాన్ని, అందులోని పవిత్ర వస్తువులన్నీ తీసుకువచ్చారు. యాజకులు, లేవీయులు వాటిని పైకి మోసుకెళ్లారు. రాజైన సొలొమోను, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులందరు మందసం ముందు సమావేశమై, లెక్కలేనన్ని గొర్రెలను పశువులను బలి ఇచ్చారు.
తర్వాత యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని మందిరంలోని గర్భాలయం అనే అతి పరిశుద్ధ స్థలంలో దాని స్థలానికి తీసుకువచ్చి, కెరూబుల రెక్కల క్రింద పెట్టారు. కెరూబుల రెక్కలు మందసం ఉన్న స్థలం మీదుగా చాపబడి మందసాన్ని, దానిని మోసే కర్రలను కప్పివేశాయి. ఈ మోతకర్రలు చాలా పొడవుగా ఉండడం వల్ల, వాటి అంచులు గర్భాలయానికి ముందున్న పరిశుద్ధ స్థలంలో నుండి కనబడతాయి, కాని పరిశుద్ధస్థలం బయట నుండి కనబడవు; ఈనాటికీ అవి అక్కడే ఉన్నాయి. మోషే హోరేబులో ఉన్నప్పుడు, అనగా ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన తర్వాత యెహోవా వారితో నిబంధన చేసినప్పుడు మందసంలో పెట్టిన రెండు రాతిపలకలు తప్ప మరేమీ దానిలో లేవు.
యాజకులు పరిశుద్ధస్థలం నుండి బయటకు వచ్చినప్పుడు యెహోవా మందిరాన్ని మేఘం కమ్ముకుంది. యెహోవా మహిమ ఆయన మందిరం నిండ కమ్ముకున్న ఆ మేఘాన్ని బట్టి యాజకులు తమ సేవ చేయలేకపోయారు.
"విశ్వాసంలేని ప్రజలారా, తిరిగి రండి" అని యెహోవా ప్రకటిస్తున్నారు, "నేను నీ భర్తను కాబట్టి నేను నిన్ను ఎంచుకుంటాను ఒక పట్టణం నుండి ఒకనిగా, ఒక వంశం నుండి ఇద్దరినిగా నిన్ను సీయోనుకు తీసుకువస్తాను. అప్పుడు నేను నీకు నా హృదయానికి చాలా దగ్గరి వారైన కాపరులను ఇస్తాను, వారు జ్ఞానంతో, అవగాహనతో మిమ్మల్ని నడిపిస్తారు. ఆ రోజుల్లో దేశంలో మీ సంఖ్య బాగా పెరిగినప్పుడు" అని యెహోవా ప్రకటిస్తున్నారు, "ప్రజలు ఇకపై, ‘యెహోవా నిబంధన మందసం’ అని అనరు. అది ఎప్పటికీ వారి మనస్సులోకి ఎక్కదు, జ్ఞాపకంలో ఉండదు; అది తప్పిపోదు, మరొకటి తయారుచేయబడదు.
మొదటి నిబంధనలో దేవుని ఆరాధించడానికి కొన్ని నియమాలు, భూసంబంధమైన ప్రత్యక్ష గుడారం ఉన్నాయి. ఆ గుడారం ఇలా ఏర్పరచబడింది. దానిలోని మొదటి గదిలో ఒక దీప దీపస్తంభం, ఒక బల్ల దానిపై అర్పించబడిన రొట్టెలు ఉన్నాయి, ఆ గదికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెర వెనుక అతి పరిశుద్ధ స్థలం అని పిలువబడే గది ఉంది, దానిలో ధూపం వేయడానికి బంగారు బలిపీఠం, బంగారంతో కప్పబడిన నిబంధన పెట్టె ఉన్నాయి. ఆ పెట్టెలో మన్నా ఉంచబడిన బంగారు పాత్ర, చిగురించిన అహరోను కర్ర, వ్రాయబడిన నిబంధన రాతిపలకలు ఉన్నాయి. ఈ పెట్టె పైన మహిమగల కెరూబులు తమ రెక్కలతో ప్రాయశ్చిత్త పీఠంను కాపాడుతూ ఉన్నాయి. అయితే ఈ సంగతుల గురించి వివరంగా ఇప్పుడు మనం చర్చించలేము.
అప్పుడు పరలోకంలోని దేవాలయం తెరచుకొంది, దేవుని నిబంధన మందసం ఆయన దేవాలయంలో కనిపించింది. అప్పుడు మెరుపులు, ధ్వనులు, ఉరుములు, భూకంపం, తీవ్రమైన వడగండ్ల వాన వచ్చాయి.