11 "నీ కొడుకులందరూ ఇక్కడే ఉన్నారా?" అని యెష్షయిని అడిగాడు. అతడు "ఇంకా చివరివాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను మేపడానికి వెళ్ళాడు" అని చెప్పాడు. అందుకు సమూయేలు "నువ్వు అతనికి కబురు పంపి ఇక్కడికి రప్పించు. అతడు వచ్చేదాకా మనం కూర్చోలేం కదా" అని యెష్షయితో చెప్పాడు.
12 యెష్షయి అతణ్ణి పిలిపించి లోపలికి తీసుకువచ్చాడు. అతడు రూపంలో ఎర్రని వాడు, చక్కని కళ్ళు కలిగి చూపులకు అందమైనవాడు. అతడు రాగానే "నేను కోరుకొన్నది ఇతడే, నీవు లేచి అతణ్ణి అభిషేకించు" అని యెహోవా చెప్పగానే, 13 సమూయేలు నూనె కొమ్మును తీసి అతని తలపై నూనె పోసి అతని అన్నల ముందు అతణ్ణి అభిషేకించాడు. ఆ రోజు నుండి యెహోవా ఆత్మ దావీదును తీవ్రంగా ఆవహించాడు. తరువాత సమూయేలు లేచి రమాకు వెళ్లిపోయాడు.