కుష్టు రోగి నయమాను స్వస్థత
1 సిరియా రాజు సైన్యాధిపతి పేరు నయమాను. అతని ద్వారా యెహోవా సిరియా దేశానికి విజయాలిచ్చాడు. అందుచేత అతడు తన రాజు దృష్టిలో గొప్పవాడూ, గౌరవనీయుడూ అయ్యాడు. ఎంతో ధైర్యవంతుడూ, బలవంతుడూ అయినప్పటికీ అతడు కుష్టు రోగి. 2 సిరియనులు దోపిడీలు చేయడానికి దళాలుగా ఇశ్రాయేలు దేశంలోకి వెళ్తూ ఉండేవారు. ఒకసారి వారు అక్కడనుండి ఒక అమ్మాయిని బందీగా పట్టుకుని వచ్చారు. ఆ అమ్మాయి నయమాను భార్యకు పరిచారిక అయింది.
3 ఆ అమ్మాయి తన యజమానురాలితో "షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గరికి నా యజమాని వెళ్ళాలని ఎంతో ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆయన నా యజమాని కుష్టురోగాన్ని నయం చేస్తాడు" అంది. 4 కాబట్టి నయమాను తన రాజు దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలు దేశం నుండి వచ్చిన అమ్మాయి చెప్పిన మాటను వివరించాడు.
5 సిరియా రాజు "నీవు వెళ్ళు. నేను ఇశ్రాయేలు రాజుకి లేఖ పంపిస్తాను" అన్నాడు. నయమాను తనతో మూడు వందల నలభై కిలోల వెండీ, ఆరు వేల తులాల బంగారం, పది జతల బట్టలూ తీసుకుని బయల్దేరాడు. వాటితో పాటు ఆ లేఖను కూడా తీసుకు వెళ్ళి ఇశ్రాయేలు రాజుకి అందించాడు. 6 ఆ లేఖలో "నా సేవకుడైన నయమానుకి ఉన్న కుష్టురోగాన్ని నీవు బాగు చేయాలి. అందుకే ఈ లేఖను అతనికిచ్చి పంపిస్తున్నాను" అని ఉంది.
7 ఇశ్రాయేలు రాజు ఆ లేఖ చదివి తన బట్టలు చింపుకున్నాడు. "ఒక మనిషికి ఉన్న కుష్టురోగాన్ని బాగు చేయమని ఇతడు నాకు లేఖ రాయడం ఏమిటి? మనుషులను చంపడానికీ బ్రతికించడానికీ నేనేమన్నా దేవుడినా? ఇతడు నాతో వివాదం పెట్టుకోవాలని చూస్తున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది" అన్నాడు.
8 ఇశ్రాయేలు రాజు తన బట్టలు చింపుకొన్న సంగతి దేవుని మనిషి ఎలీషా విన్నాడు. అప్పుడు అతడు ఇశ్రాయేలు రాజుకి "నీ బట్టలెందుకు చింపుకున్నావు? అతణ్ణి నా దగ్గరికి పంపు. ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడని అతడు తెలుసుకుంటాడు" అని సందేశం పంపించాడు. 9 కాబట్టి నయమాను తన గుర్రాలతో, రథాలన్నిటితో వచ్చి ఎలీషా యింటి గుమ్మం ఎదుట నిలిచాడు. 10 ఎలీషా ఒక వార్తాహరుడి చేత "నీవు వెళ్లి యొర్దాను నదిలో ఏడు మునకలు వెయ్యి. నీ శరీరం పూర్వస్థితికి వస్తుంది. నీవు పరిశుభ్రం అవుతావు" అని కబురు చేశాడు.
11 నయమానుకు కోపం వచ్చింది. అక్కడ నుండి వెళ్ళిపోయాడు. "ఆ వ్యక్తి బయటకు వచ్చి నా దగ్గర నిలిచి తన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసి నా వంటిపై కుష్టురోగం ఉన్న చోట తన చెయ్యి ఆడించి బాగు చేస్తాడనుకున్నాను. 12 ఇశ్రాయేలులో ఉన్న నదులన్నిటి కంటే దమస్కులోని అమానా, ఫర్పరు నదులు మంచివి కాదా? నేను వాటిలో స్నానం చేసి శుద్ధి పొందలేనా?" అంటూ తీవ్ర కోపంతో అక్కడినుండి వెళ్ళిపోయాడు.
13 అప్పుడు నయమాను సేవకులు అతని దగ్గరికి వచ్చి "అయ్యా, ఆ ప్రవక్త ఒకవేళ ఏదన్నా కష్టమైన పని చేయమంటే నీవు తప్పకుండా చేసే వాడివే కదా! దానికంటే ‘నీటిలో మునిగి బాగు పడు’ అని అతడు చెప్పడం ఇంకా మంచిదే కదా" అన్నారు. 14 అప్పుడు అతడు దేవుని మనిషి ఆదేశం ప్రకారం వెళ్ళి యొర్దాను నదిలో ఏడు సార్లు మునిగి లేచాడు. దాంతో అతని శరీరం పూర్తి స్వస్థత పొంది చిన్నపిల్లవాడి శరీరంలా పూర్వ స్థితికి వచ్చింది.