23 అప్పడు అబ్రాహాము వారిని సమీపించి ఇలా అడిగాడు. "దుర్మార్గులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా?
24 ఆ పట్టణంలో ఒకవేళ యాభైమంది నీతిమంతులు ఉంటే ఆ యాభైమంది నీతిమంతుల కోసం పట్టణాన్ని నాశనం చేయకుండా రక్షించలేవా? 25 నీతిమంతులకూ దుర్మార్గులకూ ఒకే రకంగా తీర్పు తీర్చడం నీకు దూరమౌతుంది గాక. అలాగే దుర్మార్గులతో పాటుగా నీతిమంతులను నాశనం చేయడం నీకు దూరమౌతుంది గాక! సర్వలోకానికీ తీర్పు తీర్చేవాడు న్యాయం చెయ్యడా?" 26 దానికి యెహోవా "సొదొమ పట్టణంలో యాభైమంది నీతిమంతులు నాకు కనిపిస్తే వాళ్ళ కోసం ఆ ప్రదేశాన్నంతా కాపాడతాను" అన్నాడు.
27 అందుకు అబ్రాహాము "అయ్యా చూడు, నేను దుమ్ముతో, బూడిదతో సమానం. అయినా నేను ప్రభువుతో మాట్లాడే సాహసం చేస్తున్నాను. 28 యాభై మంది నీతిమంతుల్లో ఒకవేళ ఐదుగురు తక్కువయ్యారనుకోండి. ఐదుగురు తక్కువయ్యారని ఆ పట్టణమంతటినీ నాశనం చేస్తావా?" అని మళ్ళీ అడిగాడు. అందుకాయన "అక్కడ నలభై ఐదుగురు కనిపిస్తే నాశనం చేయను" అన్నాడు.
29 అతడు మళ్ళీ ఆయనతో మాట్లాడుతూ "ఒకవేళ అక్కడ నలభై మందే కనిపిస్తారేమో" అన్నాడు. దానికి ఆయన "ఆ నలభై మంది కోసం నాశనం చేయను" అని చెప్పాడు. 30 అతడు మళ్ళీ "ప్రభూ, నాపై కోప్పడనంటే నేను మాట్లాడతాను. ఒకవేళ ముప్ఫై మందే అక్కడ కనిపిస్తారేమో" అన్నాడు. అప్పుడాయన "ముప్ఫై మంది కనిపించినా నేను పట్టణాన్ని నాశనం చేయను" అన్నాడు. 31 అందుకు అతడు "నా ప్రభువుతో మాట్లాడే సాహసం చేస్తున్నాను. ఒకవేళ ఇరవైమందే ఉంటారేమో" అన్నాడు. అప్పుడు ప్రభువు "ఆ ఇరవైమంది కోసం నాశనం చేయను" అన్నాడు.
32 చివరిగా అతడు "ప్రభూ, నాపై కోపగించకు. నేనింకా ఒక్కసారే మాట్లాడతాను. ఒకవేళ పదిమందే అక్కడ ఉన్నారేమో" అన్నాడు. అప్పుడు ప్రభువు "పదిమంది కోసం నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను" అన్నాడు. 33 అబ్రాహాముతో మాటలు ముగిసిన వెంటనే యెహోవా వెళ్ళిపోయాడు. అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు.