21 అప్పుడు మార్త యేసుతో, "ప్రభూ, నువ్వు ఇక్కడ ఉండి ఉంటే, నా సోదరుడు చనిపోయేవాడు కాదు, 22 ఇప్పుడైనా నువ్వు దేవుణ్ణి ఏమడిగినా దేవుడు నీకు ఇస్తాడని నాకు తెలుసు" అంది. 23 యేసు ఆమెతో, "నీ సోదరుడు మళ్ళీ బతికి లేస్తాడు" అన్నాడు. 24 మార్త ఆయనతో, "చివరి రోజున పునరుత్థానంలో బతికి లేస్తాడని నాకు తెలుసు" అంది.
25 అందుకు యేసు, "పునరుత్థానం, జీవం నేనే. నన్ను నమ్మినవాడు చనిపోయినా మళ్ళీ బతుకుతాడు, 26 బతికి ఉండి నన్ను నమ్మిన వారు ఎప్పుడూ చనిపోరు. ఇది నువ్వు నమ్ముతున్నావా?" అన్నాడు. 27 ఆమె, "అవును ప్రభూ, నువ్వు లోకానికి రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువి అని నమ్ముతున్నాను" అని ఆయనతో చెప్పింది.