ఉత్థానం అయిన క్రీస్తు మన సేవకు యజమాని
1 ఆ తరువాత తిబెరియ సముద్రం ఒడ్డున యేసు తనను మరోసారి కనపరచుకున్నాడు. ఎలాగంటే 2 సీమోను పేతురు, దిదుమ అనే పేరున్న తోమా, గలిలయలోని కానా ఊరివాడైన నతనయేలూ, జెబెదయి కొడుకులూ, ఇంకా ఆయన శిష్యుల్లో మరో ఇద్దరూ కలిసి ఉన్నారు.
3 సీమోను పేతురు, "నేను చేపలు పట్టడానికి వెళ్తున్నా" అన్నాడు. మిగిలిన వారు, "మేము కూడా నీతో వస్తాం" అన్నారు. వారంతా పడవ ఎక్కి వెళ్ళారు. కానీ ఆ రాత్రంతా వారు ఏమీ పట్టలేదు. 4 తెల్లవారింది. యేసు ఒడ్డున నిలబడి ఉన్నాడు. కానీ ఆయన యేసు అని శిష్యులు గుర్తు పట్టలేదు. 5 యేసు, "పిల్లలూ, చేపలు ఏమైనా దొరికాయా?" అని అడిగాడు. "లేదు" అని వాళ్ళన్నారు." 6 అప్పుడాయన, "పడవకు కుడి వైపున వలలు వేయండి. మీకు చేపలు దొరుకుతాయి" అన్నాడు. కాబట్టి వారు అలాగే చేశారు. చేపలు నిండుగా పడ్డాయి. దాంతో వారు వల లాగలేకపోయారు.
క్రీస్తు కనుసన్నల్లో సేవ, ఫలితం
7 అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు, "ఆయన ప్రభువు!" అని పేతురుతో చెప్పాడు. ఆయన ప్రభువని సీమోను పేతురు వినగానే ఇంతకు ముందు తీసివేసిన తన పైబట్ట మళ్ళీ తనపై వేసుకుని సముద్రంలో దూకాడు. 8 ఒడ్డుకి ఇంకా రెండు వందల మూరల దూరం మాత్రమే ఉంది. కాబట్టి మిగిలిన శిష్యులు చేపలు ఉన్న వలని లాగుతూ ఆ చిన్న పడవలో వచ్చారు. 9 ఒడ్డుకి రాగానే వారికి అక్కడ నిప్పులూ, వాటి పైన ఉన్న చేపలూ రొట్టే కనిపించాయి. 10 అప్పుడు యేసు, "ఇప్పుడు మీరు పట్టిన చేపల్లో కొన్ని తీసుకుని రండి" అని వారికి చెప్పాడు. 11 సీమోను పేతురు పడవ ఎక్కి వలను ఒడ్డుకి లాగాడు. దాంట్లో 153 పెద్ద చేపలున్నాయి.
తన సేవకుల అవసరాలు తీర్చే యజమాని
అన్ని చేపలు పడినా వల మాత్రం పిగిలి పోలేదు.