యెరూషలేము జయప్రవేశం
28 యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేముకు ప్రయాణమై సాగిపోయాడు. 29 ఆయన ఒలీవ కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనీ అనే గ్రామాల సమీపానికి వచ్చినపుడు తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచాడు. 30 "మీరు ఎదురుగా ఉన్న గ్రామంలోకి వెళ్ళండి. దానిలో మీరు ప్రవేశించగానే కట్టి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది. దాని మీద ఇంతవరకూ ఎవ్వరూ కూర్చోలేదు. దాన్ని విప్పి తోలుకు రండి. 31 ఎవరైనా ‘దీన్ని ఎందుకు విప్పుతున్నారు’ అని మిమ్మల్ని అడిగితే ‘ఇది ప్రభువుకు కావాలి’ అని చెప్పండి" అని చెప్పి వారిని పంపించాడు.
32 ఆయన పంపిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే దాన్ని చూశారు. 33 ఆ గాడిద పిల్లను విప్పుతుంటే దాని యజమానులు, "మీరు, గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారు?" అని వారినడిగారు. 34 దానికి వారు, "ఇది ప్రభువుకు కావాలి" అన్నారు. 35 తరువాత యేసు దగ్గరికి దాన్ని తోలుకు వచ్చారు. దానిపై తమ బట్టలు వేసి ఆయనను దానిపై కూర్చోబెట్టారు. 36 ఆయన వెళ్తుంటే దారి పొడుగునా తమ బట్టలు పరిచారు. 37 ఒలీవ కొండ నుండి దిగే చోటికి ఆయన వచ్చినప్పుడు శిష్యుల గుంపంతా తాము చూసిన అద్భుతాలను గురించి సంతోషంతో గొంతెత్తి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు. 38 "ప్రభువు పేరిట వచ్చే రాజును అందరూ స్తుతిస్తారు గాక! పరలోకంలో శాంతీ, ఉన్నత స్థలంలో మహిమ!" అన్నారు.
39 ఆ జనసమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, "బోధకా, నీ శిష్యులను గద్దించు" అని ఆయనతో అన్నారు. 40 ఆయన, "వీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని మీతో చెబుతున్నాను" అన్నాడు.