35 చాలా పొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, "ఇది నిర్జన ప్రదేశం, ఇప్పటికే పొద్దుపోయింది. 36 ఈ ప్రజలకు తినడానికి ఏమీ లేదు కాబట్టి వారు చుట్టూ ఉన్న పల్లెలకో గ్రామాలకో వెళ్ళి ఏదైనా కొనుక్కోడానికి వారిని పంపివెయ్యి" అన్నారు. 37 అయితే యేసు వారితో, "మీరే వారికి ఆహారం పెట్టండి!" అన్నాడు. అందుకు వారు ఆయనతో, "రెండు వందల దేనారాలకు రొట్టెలు కొని, వారికి పంచి పెట్టమంటావా" అని ఆయనను అడిగారు. 38 ఆయన వారితో "మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయో చూడండి" అన్నాడు. వారు వెళ్ళి చూసి, "ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలు ఉన్నాయి" అని అన్నారు.
39 అప్పుడాయన అందరినీ గుంపులు గుంపులుగా పచ్చగడ్డి మీద కూర్చోబెట్టమని శిష్యులతో చెప్పాడు. 40 ప్రజలు గుంపుకు యాభైమంది, వందమంది చొప్పున కూర్చున్నారు. 41 యేసు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలు చేతపట్టుకుని ఆకాశం వైపు చూసి, దేవునికి కృతజ్ఞత చెప్పి రొట్టెలు విరిచి, జనసమూహానికి వడ్డించడానికి శిష్యులకు అందించాడు. అదే విధంగా ఆ రెండు చేపలను కూడా భాగాలు చేసి అందరికీ పంచాడు. 42 అందరూ తిని సంతృప్తి చెందారు.
43 శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను, చేప ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు. 44 ఆ రోజు అక్కడ రొట్టెలు తిన్న పురుషులు ఐదు వేల మంది.