నాలుగు వేలమందికి ఆహారం
32 అప్పుడు యేసు తన శిష్యులను పిలిచి, "ఈ ప్రజల మీద నాకు జాలిగా ఉంది. మూడు రోజుల నుండి వీరు నా దగ్గరే ఉన్నారు. వారికి తినడానికి ఏమీ లేదు. వాళ్ళను ఆకలితో పంపటం నాకిష్టం లేదు. అలా పంపివేస్తే వారు దారిలోనే స్పృహ తప్పి పోతారేమో" అన్నాడు. 33 ఆయన శిష్యులు, "ఇంతమందికి సరిపడినన్ని రొట్టెలు ఈ అడవి ప్రాంతంలో ఎక్కడ దొరుకుతాయి?" అన్నారు. 34 యేసు, "మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి?" అని వారిని అడిగాడు. వారు, "ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఉన్నాయి" అని చెప్పారు.
35 అప్పుడు యేసు "నేల మీద కూర్చోండి" అని ఆ ప్రజలకి ఆజ్ఞాపించి, 36 ఆ ఏడు రొట్టెలు, ఆ చేపలు పట్టుకుని దేవునికి కృతజ్ఞతలు చెల్లించి వాటిని ముక్కలు చేసి తన శిష్యులకిచ్చాడు. శిష్యులు ఆ ప్రజలకు వాటిని పంచిపెట్టారు. 37 వారంతా కడుపారా తిన్న తరువాత అక్కడ ఏడు గంపల నిండుగా ముక్కలు మిగిలిపోయాయి. 38 స్త్రీలు, పిల్లలు కాకుండా కేవలం పురుషులే నాలుగువేల మంది తిన్నారు.