1 అప్పుడు రాజైన సొలొమోను దావీదు పట్టణమైన సీయోను నుండి యెహోవా నిబంధన మందసాన్ని తీసుకురావడానికి ఇశ్రాయేలు పెద్దలను, గోత్రాల పెద్దలను, ఇశ్రాయేలీయుల కుటుంబాల నాయకులందరిని యెరూషలేములో తన దగ్గరకు పిలిపించాడు. 2 ఏతనీము అనే ఏడవ నెలలో, పండుగ సమయంలో ఇశ్రాయేలీయులందరు రాజైన సొలొమోను ఎదుట సమావేశమయ్యారు.
3 ఇశ్రాయేలు పెద్దలందరు వచ్చాక, యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని తీసుకుని, 4 వారు యెహోవా మందసాన్ని, సమావేశ గుడారాన్ని, అందులోని పవిత్ర వస్తువులన్నీ తీసుకువచ్చారు. యాజకులు, లేవీయులు వాటిని పైకి మోసుకెళ్లారు. 5 రాజైన సొలొమోను, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులందరు మందసం ముందు సమావేశమై, లెక్కలేనన్ని గొర్రెలను పశువులను బలి ఇచ్చారు.
6 తర్వాత యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని మందిరంలోని గర్భాలయం అనే అతి పరిశుద్ధ స్థలంలో దాని స్థలానికి తీసుకువచ్చి, కెరూబుల రెక్కల క్రింద పెట్టారు. 7 కెరూబుల రెక్కలు మందసం ఉన్న స్థలం మీదుగా చాపబడి మందసాన్ని, దానిని మోసే కర్రలను కప్పివేశాయి. 8 ఈ మోతకర్రలు చాలా పొడవుగా ఉండడం వల్ల, వాటి అంచులు గర్భాలయానికి ముందున్న పరిశుద్ధ స్థలంలో నుండి కనబడతాయి, కాని పరిశుద్ధస్థలం బయట నుండి కనబడవు; ఈనాటికీ అవి అక్కడే ఉన్నాయి. 9 మోషే హోరేబులో ఉన్నప్పుడు, అనగా ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన తర్వాత యెహోవా వారితో నిబంధన చేసినప్పుడు మందసంలో పెట్టిన రెండు రాతిపలకలు తప్ప మరేమీ దానిలో లేవు.
10 యాజకులు పరిశుద్ధస్థలం నుండి బయటకు వచ్చినప్పుడు యెహోవా మందిరాన్ని మేఘం కమ్ముకుంది. 11 యెహోవా మహిమ ఆయన మందిరం నిండ కమ్ముకున్న ఆ మేఘాన్ని బట్టి యాజకులు తమ సేవ చేయలేకపోయారు.