వెయ్యి సంవత్సరాలు
1 ఆ తర్వాత ఒక దేవదూత తన చేతిలో అగాధపు తాళపు చెవిని ఒక పెద్ద గొలుసును పట్టుకుని పరలోకం నుండి క్రిందికి దిగి రావడం నేను చూశాను. 2 ఆ దేవదూత ఆదిసర్పం అనే ఘటసర్పాన్ని అనగా అపవాది అనే సాతానుని పట్టుకుని వెయ్యి సంవత్సరాల వరకు బంధించాడు. 3 ఆ దూత అతన్ని పాతాళంలో పడవేసి, అతడు వెయ్యి సంవత్సరాలు పూర్తయ్యే వరకు దేశాలను ఎంత మాత్రం మోసం చేయకుండా ఉండడానికి దానికి తాళం వేసి ముద్ర వేశాడు. ఆ తర్వాత అతడు కొంతకాలం వరకు వదిలిపెట్టబడతాడు.
4 అప్పుడు తీర్పు తీర్చడానికి అధికారం ఇవ్వబడినవారు కూర్చుని ఉన్న సింహాసనాలను నేను చూశాను. యేసును గురించి సాక్ష్యాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి తలలు నరికివేయబడి హతులైనవారి ఆత్మలను నేను చూశాను. వారు ఆ మృగాన్ని గాని వాని విగ్రహాన్ని గాని పూజించలేదు, వారు దాని ముద్రను తమ నుదుటి మీద గాని చేతి మీద గాని వేయించుకోలేదు. వారు బ్రతికివచ్చి క్రీస్తుతో పాటు వెయ్యి సంవత్సరాలు పరిపాలించారు. 5 చనిపోయినవారిలో మిగిలినవారు ఈ వెయ్యి సంవత్సరాలు గడిచేవరకు మళ్ళీ బ్రతుకలేదు. ఇదే మొదటి పునరుత్థానము. 6 మొదటి పునరుత్థానంలో పాలుపొందినవారు ధన్యులు పరిశుద్ధులు. రెండవ మరణానికి వారి మీద అధికారం లేదు. అయితే వారు దేవునికి క్రీస్తుకు యాజకులుగా ఉంటూ ఆయనతో పాటు వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తారు.
సాతానుకు తీర్పు
7 వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను చెరలో నుండి విడుదల చేయబడతాడు. 8 ఆ సాతాను భూమి నలుదిక్కుల ఉన్న దేశాలను గోగు మాగోగు అనే వారిని మోసపుచ్చి యుద్ధానికి సమకూర్చడానికి బయలుదేరి వెళ్తాడు. వారి సంఖ్య సముద్రపు ఇసుక రేణువుల్లా లెక్కకు మించి ఉంది. 9 వారు భూమి అంతటా ప్రయాణించి దేవుని ప్రజలు ఉన్నచోటును, ఆయన ప్రేమించిన పట్టణాన్ని ముట్టడిస్తారు. కానీ పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేస్తుంది. 10 అప్పుడు వారిని మోసగించిన సాతాను అగ్నిగంధకాల సరస్సులో పడవేయబడతాడు. అక్కడే ఆ మృగం, అబద్ధ ప్రవక్త పడవేయబడ్డారు. అక్కడ వారు నిరంతరం రాత్రింబగళ్ళు వేధించబడతారు.