యేసు తోమాకు ప్రత్యక్షమగుట
24 పన్నెండుమంది శిష్యులలో దిదుమా అని పిలువబడే తోమా, యేసు వచ్చినప్పుడు అక్కడ వారితో లేడు. 25 కాబట్టి మిగతా శిష్యులు అతనితో, "మేము ప్రభువును చూశాం" అని చెప్పారు.
అప్పుడు అతడు వారితో, "నేను ఆయన చేతిలో మేకులు కొట్టిన గాయాలలో నా వ్రేలును ఆయనను పొడిచిన ప్రక్కలో నాచేయి పెట్టి చూస్తేనే గాని నేను నమ్మను" అన్నాడు.
26 ఒక వారం రోజుల తర్వాత యేసు శిష్యులు మరల ఇంట్లో ఉన్నప్పుడు తోమా వారితో పాటు ఉన్నాడు. వారి ఇంటి తలుపులు మూసి ఉన్నాయి, అయినా యేసు వారి మధ్యకు వచ్చి, "మీకు సమాధానం కలుగును గాక!" అని వారితో చెప్పారు. 27 తర్వాత ఆయన తోమాతో, "నా చేతులను చూడు; నీ వ్రేలితో ఆ గాయాలను ముట్టి చూడు. నీ చేయి చాపి నా ప్రక్క గాయాన్ని ముట్టి చూడు. అనుమానించడం మాని నమ్ము" అన్నారు.
28 తోమా ఆయనతో, "నా ప్రభువా, నా దేవా!" అన్నాడు.
29 అప్పుడు యేసు అతనితో, "నీవు నన్ను చూసి నమ్మినావు; చూడకుండానే నమ్మినవారు ధన్యులు" అన్నారు.