ఏడుగురు శిష్యులకు కనిపించిన యేసు
1 ఆ తర్వాత యేసు మరల తన శిష్యులకు తిబెరియ సముద్రం21:1 లేదా గలలీ సముద్రం తీరంలో కనిపించారు. 2 సీమోను పేతురు, దిదుమా అని పిలువబడే తోమా, గలిలయలోని కానాకు చెందిన నతనయేలు, జెబెదయి కుమారులు, మరో ఇద్దరు శిష్యులు కలిసి ఉన్నప్పుడు, 3 సీమోను పేతురు వారందరితో, "నేను చేపలను పట్టడానికి వెళ్తున్నాను" అని చెప్పగా వారు, "మేము కూడ నీతో వస్తాము" అన్నారు. కాబట్టి వారు పడవలో ఎక్కి వెళ్లి, రాత్రంతా కష్టపడినా కానీ వారు ఏమీ పట్టుకోలేదు.
4 తెల్లవారుజామున, యేసు సరస్సు ఒడ్డున నిలబడి ఉన్నారు, కానీ శిష్యులు ఆయనను యేసు అని గుర్తించలేదు.
5 ఆయన వారిని పిలిచి, "పిల్లలారా, మీ దగ్గర చేపలు ఏమైనా ఉన్నాయా?" అని అడిగారు.
అందుకు వారు, "లేవు" అని జవాబిచ్చారు.
6 ఆయన, "పడవకు కుడి వైపున మీ వలలు వేయండి, మీకు దొరుకుతాయి" అని చెప్పగా వారు అలాగే చేశారు. అప్పుడు విస్తారంగా చేపలు పడ్డాయి కాబట్టి వారు ఆ వలలను లాగలేకపోయారు.
7 యేసు ప్రేమించిన శిష్యుడు సీమోను పేతురుతో, "ఆయన ప్రభువు!" అన్నాడు. "ఆయన ప్రభువు" అని పేతురు విన్న వెంటనే ఇంతకుముందు తీసి వేసిన పైబట్టను తన చుట్టూ వేసుకుని నీటిలోనికి దూకాడు. 8 పడవలో ఉన్న మిగతా శిష్యులు చేపలున్న వలను లాగుతూ ఉన్నారు. అప్పుడు వారు ఒడ్డుకు సుమారు వంద గజాల21:8 లేదా సుమారు 90 మీటర్లు దూరంలో మాత్రమే ఉన్నారు. 9 వారు ఒడ్డుకు రాగానే, అక్కడ నిప్పులో కాలుతుండిన చేపలను కొన్ని రొట్టెలను చూశారు.
10 యేసు వారితో, "మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్నిటిని తీసుకురండి" అని చెప్పారు. 11 సీమోను పేతురు పడవ ఎక్కి వలను ఒడ్డుకు లాగాడు. ఆ వలలో 153 పెద్ద చేపలున్నాయి. అన్ని చేపలు ఉన్నా ఆ వలలు చిరిగిపోలేదు.