33 కపాలం అనే స్థలానికి వారు వచ్చినప్పుడు, ఆయనను నేరస్థులతో పాటు కుడి వైపున ఒకడు, ఎడమవైపున ఒకన్ని పెట్టి సిలువ వేశారు. 34 యేసు, "తండ్రీ, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించండి" అని చెప్పారు. వారు చీట్లు వేసి ఆయన వస్త్రాలను పంచుకున్నారు.
35 ప్రజలు నిలబడి ఇదంతా చూస్తున్నారు, అధికారులు కూడ, "వీడు ఇతరులను రక్షించాడు; వీడు నిజంగా దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయితే తనను తాను రక్షించుకోవాలి" అని అంటూ ఎగతాళి చేశారు.
36 అప్పుడు సైనికులు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు చిరకాను పులిసిన ద్రాక్షరసం అందించి, 37 "నీవు యూదుల రాజువైతే, నిన్ను నీవే రక్షించుకో" అని ఆయనను వెక్కిరించారు.
38 ఆయనపై ఉన్న నేరం యొక్క వ్రాతపూర్వక ఉత్తర్వు ఇలా ఉంది:
ఇతడు యూదుల రాజు.
39 వ్రేలాడుతున్న ఆ నేరస్థులలో ఒకడు ఆయనను అవమానిస్తూ, "నీవు క్రీస్తువు కాదా? నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడ రక్షించు!" అని హేళన చేశాడు.
40 కానీ మరొక నేరస్థుడు వానిని గద్దించి, "నీవు కూడా అదే శిక్షను పొందుతున్నావు, నీవు దేవునికి భయపడవా?" అన్నాడు. 41 "మనం చేసిన తప్పులకు న్యాయంగానే శిక్షను అనుభవిస్తున్నాం కాని ఈయన ఏ తప్పు చేయలేదు" అన్నాడు.
42 ఆ తర్వాత ఆ నేరస్థుడు యేసును చూసి, "నీవు నీ రాజ్యంలోనికి వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో" అన్నాడు.
43 యేసు వానితో, "నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉంటావని, నీతో నిశ్చయంగా చెప్తున్నాను" అన్నారు.