మొదటి శిష్యులను పిలుచుకొన్న యేసు
1 ఒక రోజు యేసు గెన్నేసరెతు5:1 గెన్నేసరెతు అంటే గలిలయ సముద్రం సరస్సు తీరాన నిలబడి ఉన్నారు, ప్రజలు ఆయన చుట్టూ చేరి దేవుని వాక్యాన్ని వింటున్నారు. 2 సరస్సు తీరాన ఆయన రెండు పడవలను చూశారు, జాలరులు వాటిని అక్కడ విడిచిపెట్టి, తమ వలలను కడుక్కుంటున్నారు. 3 ఆయన ఆ పడవలలో ఒక దానిలోకి ఎక్కారు, ఆ పడవ సీమోనుది, కాబట్టి ఆయన తీరం నుండి కొంచెం దూరం తోయమని అతన్ని అడిగారు. ఆయన పడవలో కూర్చుని, అక్కడినుండి ప్రజలకు బోధించారు.
4 ఆయన మాట్లాడడం ముగించాక, ఆయన సీమోనుతో, "పడవను నీటి లోతుకు నడిపించి, చేపలు పట్టడానికి వలలు వేయి" అన్నారు.
5 అందుకు సీమోను, "బోధకుడా, రాత్రంతా కష్టపడినా మేము ఏమి దొరకలేదు. అయినా నీవు చెప్పావు కాబట్టి నేను వలలను వేస్తాను" అని ఆయనతో అన్నాడు.
6 వారు అలా చేసినప్పుడు, విస్తారమైన చేపలు వలల్లో పడి ఆ వలలు పిగిలిపోసాగాయి. 7 అందుకు వారు వేరే పడవల్లోని తమ జతపనివారిని పిలిచి వచ్చి సహాయం చేయమని సైగలు చేశారు, కాబట్టి వారు వచ్చి ఆ రెండు పడవలను నింపగా ఆ బరువుకు ఆ పడవలు మునిగిపోసాగాయి.
8 సీమోను పేతురు జరిగింది చూసి, యేసు మోకాళ్లమీద పడి, "ప్రభువా, నా దగ్గర నుండి వెళ్లిపో; నేను పాపిష్ఠి వాడను!" అన్నాడు. 9 అతడు అతనితో ఉన్నవారందరు విస్తారంగా పట్టిన చేపలను చూసి ఆశ్చర్యపడ్డారు. 10 సీమోను జతపనివారైన జెబెదయి కుమారులైన, యాకోబు యోహానులు కూడా ఆశ్చర్యపడ్డారు.
అప్పుడు యేసు సీమోనుతో, "భయపడకు; ఇప్పటినుండి నీవు మనుష్యులను పట్టే జాలరివి" అన్నారు. 11 వారు తమ పడవలను ఒడ్డుకు చేర్చి, అన్నిటిని విడిచి ఆయనను వెంబడించారు.