18 కొందరు మనుష్యులు పక్షవాతంగల ఒక వ్యక్తిని చాపమీద మోసుకొని తెచ్చి, యేసు ముందు ఉంచాలని ఇంట్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. 19 కానీ ప్రజలు గుంపుగా ఉన్నందుకు వానిని లోపలికి తేవడానికి వీలుకాలేదు, కాబట్టి వారు ఆ ఇంటి కప్పుమీదికి ఎక్కి పెంకులు తీసి ప్రజలమధ్య, ఆ చాపతోనే వానిని యేసు ముందు దింపారు.
20 యేసు వారి విశ్వాసం చూసి, అతనితో, "స్నేహితుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి" అన్నారు.
21 పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు, తమలో తాము, "దైవదూషణ చేస్తున్న వీడు ఎవడు? దేవుడు తప్ప పాపాలను క్షమించగలవారెవరు?" అని ఆలోచించడం మొదలుపెట్టారు.
22 యేసు వారి ఆలోచనలను గ్రహించి, "మీ హృదయాల్లో మీరు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు? 23 వీటిలో ఏది చెప్పడం సులభం: ‘నీ పాపాలు క్షమించబడ్డాయి’ అని చెప్పడమా లేదా ‘లేచి నడువు’ అని చెప్పడమా?" 24 అయితే మనుష్యకుమారునికి భూలోకంలో పాపాలను క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలని, "నేను కోరుతున్నాను" అని అన్నారు. ఆయన పక్షవాతం గలవానితో, "నేను చెప్తున్న, నీవు లేచి, నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్లు" అన్నారు. 25 వెంటనే వాడు వారి ముందే లేచి, తాను పడుకుని ఉన్న పరుపెత్తుకొని దేవుని స్తుతిస్తూ తన ఇంటికి వెళ్లాడు.