31 యేసు ఇంకా మాట్లాడుతూ, "మరి, ఈ తరం వారిని నేను దేనితో పోల్చాలి? వారు ఎలాంటివారు? 32 వారు వీధిలో ఆడుకుంటూ చాడీలు చెప్పుకునే చిన్న పిల్లల్లాంటివారు:
" ‘మేము మీ కోసం పిల్లనగ్రోవి వాయించాం,
కాని మీరు నాట్యం చేయలేదు;
మేము విషాద గీతం పాడాం,
కాని మీరు ఏడవలేదు.’
33 ఎందుకంటే బాప్తిస్మమిచ్చే యోహాను రొట్టెలు తినలేదు ద్రాక్షరసం త్రాగలేదు అయినా మీరు, ‘వీడు దయ్యం పట్టినవాడు’ అంటున్నారు. 34 మరోవైపు మనుష్యకుమారుడు తింటున్నాడు త్రాగుతున్నాడు కాబట్టి మీరు, ‘ఇదిగో తిండిబోతు, త్రాగుబోతు, పన్ను వసూలు చేసేవారికి, పాపులకు స్నేహితుడు’ అంటున్నారు. 35 కాని జ్ఞానం సరియైనదని దాని పిల్లలందరిని బట్టే నిరూపించబడుతుంది."
యేసు పాదాలను అభిషేకించిన ఒక పాపిష్ఠిదైన స్త్రీ
36 పరిసయ్యులలో ఒకడు యేసును తనతో కలిసి భోజనం చేయడానికి ఆహ్వానించాడు, ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజనబల్ల దగ్గర కూర్చున్నారు. 37 ఆ గ్రామంలోని పాపిష్ఠిదైన ఒక స్త్రీ పరిసయ్యుని ఇంట్లో యేసు భోజనం చేస్తున్నాడని తెలుసుకొని, పరిమళద్రవ్యం ఉన్న ఒక పాలరాతి సీసాను తీసుకుని వచ్చింది.