27 యేసు ఒడ్డున అడుగు పెట్టగానే, దయ్యాలు పట్టిన గ్రామస్తుడొకడు ఆయనకు ఎదురుగా వచ్చాడు. వాడు చాలా కాలం నుండి బట్టలు వేసుకోలేదు ఇంట్లో కాకుండా, సమాధుల్లో నివసించేవాడు. 28 వాడు యేసును చూడగానే, వాడు కేక వేస్తూ ఆయన పాదాల దగ్గర పడి, "సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, యేసూ, నాతో నీకేమి? నన్ను వేధించవద్దని నిన్ను వేడుకొంటున్నాను!" అని బిగ్గరగా అరిచాడు. 29 ఎందుకంటే యేసు ఆ అపవిత్రాత్మను వాని నుండి బయటకు రమ్మని ఆజ్ఞాపించారు. అది చాలాసార్లు వానిని పట్టి పీడించింది, వాని కాళ్లకు చేతులకు గొలుసులను వేసి బంధించి కాపలా ఉన్నా, వాడు ఆ గొలుసులను తెంపివేసేవాడు, ఆ దయ్యాలు వాన్ని అరణ్యంలోనికి తీసుకెళ్ళేవి.
30 అప్పుడు యేసు, "నీ పేరేమిటి?" అని వాన్ని అడిగారు.
అందుకు వాడు, "సేన" అని జవాబిచ్చాడు, ఎందుకంటే అనేక దయ్యాలు వానిలో చొరబడి ఉన్నాయి. 31 పాతాళానికి వెళ్లమని తమను ఆజ్ఞాపించవద్దని అవి యేసును పదే పదే బ్రతిమాలాయి.
32 అక్కడ ఒక పెద్ద పందుల మంద కొండమీద మేస్తూ ఉంది. ఆ దయ్యాలు ఆ పందులలోనికి చొరబడడానికి అనుమతి ఇవ్వమని యేసును బ్రతిమాలాయి, ఆయన వాటికి అనుమతి ఇచ్చారు. 33 ఆ దయ్యాలు వానిలో నుండి బయటకు వచ్చి, ఆ పందులలోనికి చొరబడ్డాయి, వెంటనే ఆ మంద కొండ మీది నుండి వేగంగా సరస్సులోనికి పరుగెత్తుకొని వెళ్లి మునిగిపోయింది.
34 ఎప్పుడైతే పందులను కాస్తున్నవారు జరిగిన దానిని చూశారో, వారు పరుగెత్తుకొని వెళ్లి పట్టణంలోను గ్రామీణ ప్రాంతాల్లోనూ తెలియజేశారు. 35 ప్రజలు ఏమి జరిగిందో చూడడానికి వెళ్లారు. వారు యేసు దగ్గరకు వచ్చినప్పుడు, దయ్యాలు వదిలిన మనుష్యుడు, బట్టలు వేసుకుని సరియైన మానసిక స్థితిలో, యేసు పాదాల దగ్గర కూర్చుని ఉండడం చూశారు; వారు భయపడ్డారు.