చూపును పొందుకొనిన గ్రుడ్డి బర్తిమయి
46 ఆ తర్వాత వారు యెరికో పట్టణం చేరుకున్నారు. యేసు, ఆయన శిష్యులు, గొప్ప జనసమూహంతో కలిసి, పట్టణం విడిచి వెళ్తుండగా, తిమయి కుమారుడైన బర్తిమయి అనే ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుని భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. 47 వాడు నజరేయుడైన యేసు అక్కడ ఉన్నాడని విని, "దావీదు కుమారుడా యేసూ, నా మీద దయ చూపించు!" అని కేకలు వేయడం మొదలుపెట్టాడు.
48 అనేకులు వాన్ని గద్దించారు, నిశ్శబ్దంగా ఉండమని వానికి చెప్పారు. కాని వాడు, "దావీదు కుమారుడా, నన్ను కరుణించు!" అని ఇంకా బిగ్గరగా కేకలు వేశాడు.
49 అప్పుడు యేసు ఆగి, "వాన్ని పిలువండి" అన్నారు.
వారు ఆ గ్రుడ్డివానితో, "సంతోషించు! లేచి రా! ఆయన నిన్ను పిలుస్తున్నారు" అన్నారు. 50 అప్పుడు వాడు తన పైవస్త్రాన్ని పారవేసి దిగ్గున లేచి యేసు దగ్గరకు వచ్చాడు.
51 యేసు వాన్ని, "నేను నీకు ఏమి చేయాలని కోరుతున్నావు?" అని అడిగారు.
అప్పుడు ఆ గ్రుడ్డివాడు, "బోధకుడా, నాకు చూపు కావాలి" అని అన్నాడు.
52 అందుకు యేసు, "వెళ్లు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది" అని చెప్పారు. వెంటనే వాడు చూపు పొందుకొని ఆ దారిన యేసును వెంబడించాడు.