దయ్యము పట్టిన వాన్ని బాగుచేసిన యేసు
1 వారు సరస్సు దాటి గెరాసేనుల ప్రాంతానికి వెళ్లారు. 2 యేసు పడవ దిగిన వెంటనే, అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయనను కలుసుకున్నాడు. 3 వాడు సమాధుల్లో నివసించేవాడు, గొలుసులతో కూడా ఎవరు వాన్ని బంధించలేకపోయారు. 4 ఎందుకంటే తరచుగా వాని కాళ్లుచేతులను గొలుసులతో బంధించేవారు కానీ, వాడు ఆ గొలుసులను తెంపి వాటిని ముక్కలు చేసేవాడు. వాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. 5 వాడు పగలు రాత్రులు సమాధుల మధ్య, కొండల్లో కేకలువేస్తూ తనను తాను రాళ్లతో గాయపరచుకొనే వాడు.
6 వాడు యేసును దూరం నుండి చూసి, పరుగెత్తుకొని వెళ్లి ఆయన ముందు మోకరించాడు. 7 వాడు బిగ్గరగా కేకలువేస్తూ, "సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, యేసూ, నాతో నీకేమి? దేవుని పేరట నన్ను వేధించవద్దు నిన్ను వేడుకొంటున్నాను!" అని అన్నాడు. 8 ఎందుకంటే యేసు, "అపవిత్రాత్మా, వీన్ని విడిచిపో!" అని వానితో అన్నారు.
9 అప్పుడు యేసు, "నీ పేరేమిటి?" అని వాన్ని అడిగారు.
అందుకు వాడు, "నా పేరు సేన, ఎందుకంటే మేము అనేకులం" అని జవాబిచ్చాడు. 10 "వాటిని ఆ ప్రాంతం నుండి బయటకు పంపివేయవద్దని" వాడు యేసును పదే పదే వేడుకున్నాడు.
11 అక్కడ దగ్గరలో పెద్ద పందుల మంద కొండమీద మేస్తూ ఉంది. 12 ఆ దయ్యాలు, "ఆ పందులలోనికి చొరబడడానికి అనుమతి ఇవ్వు" అని యేసును బ్రతిమాలాయి. 13 ఆయన వాటికి అనుమతి ఇచ్చారు, ఆ అపవిత్రాత్మలు బయటకు వచ్చి పందులలోనికి చొరబడ్డాయి. ఇంచుమించు రెండువేల పందులు గల ఆ మంద, వేగంగా సరస్సులోనికి పరుగెత్తుకొని వెళ్లి మునిగిపోయింది.
14 ఆ పందులను కాస్తున్నవారు పరుగెత్తుకొని వెళ్లి పట్టణంలోను, గ్రామీణ ప్రాంతాల్లోనూ జరిగినదంతా తెలియజేశారు, అప్పుడు ఏమి జరిగిందో చూడడానికి ప్రజలు వెళ్లారు.