35 యేసు ఇంకా మాట్లాడుతుండగా, సమాజమందిరపు నాయకుడైన యాయీరు ఇంటి నుండి కొందరు వచ్చారు. వారు యాయీరుతో, "నీ కుమార్తె చనిపోయింది. ఇంకా బోధకునికి శ్రమ కలిగించడం ఎందుకు?" అన్నారు.
36 యేసు వారు చెప్పిన మాటలను పట్టించుకోకుండా, సమాజమందిరపు అధికారితో, "భయపడకు; నమ్మకం మాత్రం ఉంచు" అని చెప్పారు.
37 ఆయన పేతురు యాకోబు సహోదరుడైన యోహాను అనే వారిని తప్ప మరి ఎవరిని తన వెంట తీసుకెళ్లలేదు. 38 వారు సమాజమందిరపు నాయకుని ఇంటికి వచ్చినప్పుడు, ఇంటివారు గట్టిగా ఏడుస్తూ, ప్రలాపిస్తూ, గందరగోళంగా ఉండడం యేసు చూశారు. 39 ఆయన ఇంట్లోకి వెళ్లి వారితో, "మీరెందుకు ప్రలాపించి ఏడుస్తున్నారు? అమ్మాయి చనిపోలేదు కానీ నిద్రపోతుంది" అన్నారు. 40 అందుకు వారు ఆయనను హేళన చేశారు.
అయితే ఆయన వారందరిని బయటకు పంపిన తర్వాత, ఆ అమ్మాయి తల్లిదండ్రులను తనతో ఉన్న శిష్యులను వెంటబెట్టుకొని, ఆ అమ్మాయి ఉన్న గదిలోకి వెళ్లారు. 41 ఆయన ఆ అమ్మాయి చేయి పట్టుకుని, "తలితాకుమి!" అన్నారు. ఆ మాటకు, "చిన్నదానా, లే!" అని అర్థము. 42 వెంటనే ఆ అమ్మాయి లేచి నడవ మొదలుపెట్టింది. ఆ అమ్మాయి వయస్సు పన్నెండు సంవత్సరాలు. ఇది చూసిన వారికి చాలా ఆశ్చర్యం కలిగింది. 43 జరిగిన ఈ సంగతి ఎవనికి తెలియకూడదని ఆయన వారికి ఖచ్చితంగా ఆదేశించి, ఆమెకు ఆహారం పెట్టమని చెప్పారు.