అయిదు వేలమందికి ఆహారం పెట్టిన యేసు
30 అపొస్తలులు యేసు చుట్టూ గుమికూడి తాము బోధించినవి, తాము చేసినవి ఆయనకు తెలియజేశారు. 31 అనేకమంది వస్తూ పోతూ ఉండడంతో వారికి భోజనం చేయడానికి కూడా అవకాశం దొరకలేదు. కాబట్టి ఆయన, "మీరు నాతో కూడా ఏకాంత స్థలానికి వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకోండి" అని చెప్పారు.
32 కాబట్టి వారు పడవ ఎక్కి ఏకాంత స్థలానికి వెళ్లారు. 33 అయితే వారు వెళ్తున్నారని చూసిన అనేకమంది వారిని గుర్తుపట్టి, అన్ని పట్టణాల నుండి పరుగెత్తుకుంటూ వెళ్లి వారికంటే ముందే ఆ స్థలానికి చేరుకొన్నారు. 34 యేసు పడవ దిగి, గొప్ప జనసమూహం రావడం చూసినప్పుడు, వారు కాపరి లేని గొర్రెలవలె ఉన్నారని వారి మీద కనికరపడ్డారు. వారికి అనేక సంగతులను బోధించడం మొదలుపెట్టారు.
35 అప్పటికి ప్రొద్దుపోయే సమయం అయ్యింది, కాబట్టి శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, "ఇది మారుమూల ప్రాంతం, పైగా ఆలస్యం కూడా అవుతుంది. 36 కాబట్టి జనాన్ని పంపివేయండి, వారే చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్లి భోజనాన్ని కొనుక్కుంటారు" అన్నారు.
37 అందుకు యేసు, "మీరే వారికి భోజనం పెట్టండి" అన్నారు.
అందుకు వారు, "రెండువందల దేనారాల కంటే ఎక్కువవుతుంది. మేము వెళ్లి, అంత డబ్బు ఖర్చుపెట్టి రొట్టెలను కొని, వారికి పెట్టాలా?" అని ఆయనను అడిగారు.
38 అందుకు ఆయన, "మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? వెళ్లి చూడండి" అని అడిగారు.
వారు వెళ్లి చూసి, "అయిదు రొట్టెలు, రెండు చేపలు ఉన్నాయి" అన్నారు.
39 అప్పుడు ఆయన వారందరిని గుంపులుగా పచ్చగడ్డి మీద కూర్చోపెట్టమని శిష్యులతో చెప్పారు. 40 వారు వంద యాభైల చొప్పున గుంపులుగా కూర్చున్నారు. 41 అప్పుడు ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను చేతిలో పట్టుకుని ఆకాశం వైపు కళ్ళెత్తి, కృతజ్ఞత చెల్లించి ఆ రొట్టెలను విరిచారు. తర్వాత ప్రజలకు పంచిపెట్టడానికి తన శిష్యులకు ఇచ్చారు. ఆయన ఆ రెండు చేపలను కూడా వారందరికి విభజించారు. 42 వారందరు తిని తృప్తి పొందారు. 43 తర్వాత శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను చేప ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు. 44 తిన్న వారి సంఖ్య అయిదు వేలమంది పురుషులు.