కనాను స్త్రీ విశ్వాసం
21 యేసు అక్కడినుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతానికి వెళ్లారు. 22 అక్కడ నివసించే ఒక కనాను స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి, "ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు! నా కుమార్తెకు దయ్యం పట్టి చాలా బాధపడుతోంది" అని కేకలు వేసింది.
23 కాని యేసు ఆమె మాటలకు సమాధానం ఇవ్వలేదు. కాబట్టి ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, "ఈమె కేకలువేస్తూ మన వెనుకే వస్తుంది కాబట్టి ఈమెను పంపివేయమని" ఆయనను వేడుకొన్నారు.
24 అందుకు యేసు, "నేను ఇశ్రాయేలులో తప్పిపోయిన గొర్రెల దగ్గరికే పంపబడ్డాను" అని చెప్పారు.
25 ఆ స్త్రీ వచ్చి ఆయన ముందు మోకరించి, "ప్రభువా, నాకు సహాయం చేయమని" అడిగింది.
26 అందుకు యేసు, "పిల్లల రొట్టెలను తీసుకుని, కుక్కలకు వేయడం సరికాదు" అన్నారు.
27 అప్పుడు ఆమె, "నిజమే ప్రభువా, కానీ కుక్కలు కూడ తమ యజమానుల బల్ల మీద నుండి పడే ముక్కలను తింటాయి కదా!" అని చెప్పింది.
28 అందుకు యేసు, "అమ్మా, నీకు ఉన్న నమ్మకం చాలా గొప్పది! నీవు కోరినట్టే నీకు జరుగును గాక!" అని ఆమెతో చెప్పారు. ఆ క్షణంలోనే ఆమె కూతురు స్వస్థత పొందింది.