యేసు రాజుగా యెరూషలేముకు వచ్చుట
1 వారు యెరూషలేముకు సమీపిస్తూ, ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే గ్రామానికి వచ్చాక, యేసు తన ఇద్దరు శిష్యులను పంపుతూ, 2 "మీ ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్లండి. అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద, గాడిదపిల్ల మీకు కనబడతాయి. వాటిని విప్పి నా దగ్గరకు తీసుకురండి. 3 ఎవరైనా మిమ్మల్ని ఏమైన అడిగితే, ‘అవి ప్రభువుకు కావాలి’ అని చెప్పండి, అతడు వెంటనే వాటిని పంపుతారు" అని చెప్పి వారిని పంపారు.
4 ప్రవక్త ద్వారా చెప్పబడిన ఈ మాటలు నెరవేరడానికి ఇలా జరిగింది:
5 " ‘ఇదిగో, గాడిద మీద, గాడిదపిల్ల మీద,
సాత్వికునిగా స్వారీ చేస్తూ,
నీ రాజు నీ దగ్గరకు వస్తున్నాడు’
అని సీయోను కుమారితో చెప్పండి."21:5 జెకర్యా 9:9
6 శిష్యులు వెళ్లి, యేసు తమకు ఆదేశించిన ప్రకారం చేశారు. 7 వారు ఆ గాడిదను, దాని పిల్లను తీసుకువచ్చి వాటి మీద తమ వస్త్రాలను వేశారు, ఆయన వాటి మీద కూర్చున్నారు. 8 ఒక గొప్ప జనసమూహం తమ వస్త్రాలను దారి అంతటా పరచారు, కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి అంతటా పరచారు. 9 ఆయన ముందు వెళ్లే జనసమూహం ఆయనను వెంబడించేవారు బిగ్గరగా,
"దావీదు కుమారునికి హోసన్నా!21:9 హెబ్రీలో అర్థం "రక్షించు!" తర్వాత అది స్తుతిని వ్యక్తపరిచే పదం అయ్యింది; 15 వచనం; అలాగే మార్కు 11:9; యోహాను 12:13"
"ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక!"21:9 కీర్తన 118:25,26
"సర్వోన్నతమైన స్థలాల్లో హోసన్నా!"
అని కేకలు వేశారు.
10 యేసు యెరూషలేములో ప్రవేశించినప్పుడు, పట్టణమంతా కలవరపడి, "ఈయన ఎవరు?" అని అడిగారు.
11 అందుకు ఆ జనసమూహం, "ఈయన యేసు, గలిలయ ప్రాంతంలోని నజరేతు గ్రామం నుండి వచ్చిన ప్రవక్త" అని జవాబిచ్చారు.