Publicidade

Ester 3

యూదుల పై హామాను కుట్ర

1 ఈ విషయాలు జరిగాక అహష్వేరోషు రాజు హమ్మెదాతా కొడుకు, అగగు వంశం వాడు అయిన హామానుకు పదోన్నతి కలిగించి, అతని అధికార హోదాను తన దగ్గరున్న అధిపతులందరికంటే ఎక్కువగా చేశాడు. 2 కాబట్టి రాజ భవన ద్వారం దగ్గర ఉండే రాజోద్యోగులంతా రాజాజ్ఞ ప్రకారం మోకాళ్లూని హామానుకు నమస్కరించారు. మొర్దెకై మాత్రం అలా వంగలేదు, సాష్టాంగ పడలేదు. 3 రాజు భవన ద్వారం దగ్గర ఉండేవారంతా అతనితో "నువ్వు రాజాజ్ఞ పాటించవేమిటి?" అని అడిగేవారు. 4 వారు పదే పదే అలా అడిగినా అతడు వారి మాట చెవిని బెట్టలేదు. తాను యూదుడిననీ ఆ కారణంగా తాను ఆ పని చేయలేననీ అతడు వారితో చెప్పాడు. అందుకని అతడు ఆ మాటపై నిలిచి ఉంటాడో లేదో చూద్దాం అని వారు హామానుకు ఈ విషయం తెలియజేశారు.

5 మొర్దెకై తన ముందు మోకరించక పోవడం, వంగి నమస్కరించక పోవడం చూసి హామాను మండిపడ్డాడు. 6 అతడు, మొర్దెకై జాతి ప్రజలు ఎవరో తెలుసుకుని "మొర్దెకైని మాత్రమే చంపితే అందులో గొప్పతనం ఏముంది?" అనుకున్నాడు. ఎందుకంటే అహష్వేరోషు రాజ్యమంతటా ఉన్న మొర్దెకై జాతి ప్రజలైన యూదులనందరినీ తుడిచి పెట్టేయాలని అతడు అనుకున్నాడు. 7 రాజైన అహష్వేరోషు పరిపాలన పన్నెండో సంవత్సరంలో నీసాను అనే మొదటి నెలలో వారు హామాను ఎదుట "పూరు" అంటే చీటిని రోజు రోజుకీ నెల నెలకీ వేశారు. చివరికి అదారు అనే పన్నెండో నెల ఎంపిక అయింది.

8 అప్పుడు హామాను అహష్వేరోషుతో ఇలా చెప్పాడు. "మీ రాజ్య సంస్థానాలన్నింటిలో ఒక జాతి ప్రజలు అక్కడక్కడా నివసిస్తున్నారు. వారి చట్టాలు ఇతర ప్రజల చట్టాలకు వ్యతిరేకం. వారు రాజాజ్ఞలు పాటించరు. కాబట్టి వారిని ఉండనివ్వడం రాజుకు శ్రేయస్కరం కాదు. 9 రాజుకు అంగీకారమైతే వారిని వధించడానికి ఆజ్ఞ ఇవ్వండి. నేను ఈ రాచకార్యాన్ని జరిగించే వారికి ఇరవై వేల మణుగుల వెండిని తూచి రాజు గారి ఖజానాలో ఉంచుతాను." 10 రాజు తన రాజముద్రిక తీసి దాన్ని హమ్మెదాతా కొడుకు, అగగు వంశీకుడు అయిన హామానుకు ఇచ్చాడు. ఇతడు యూదులకు శత్రువు. 11 "ఆ వెండి నీకు, నీ వారికీ ఇచ్చే ఏర్పాటు చేస్తాను. దానితో నువ్వు ఏది అనుకుంటే అది చెయ్యి" అన్నాడు.

12 మొదటి నెల పదమూడో రోజున రాజుగారి లేఖికులను పిలిపించారు. హామాను ఆజ్ఞాపించిన ప్రకారం, రాజు నియమించిన సంస్థానాల అధికారులకు, వివిధ సంస్థానాల పాలకులకు, వివిధ ప్రజల అధికారులకు, ప్రజలందరిపై ఉన్న కార్యనిర్వాహక అధిపతులకు వారి వారి లిపి ప్రకారం, వివిధ ప్రజల భాషల్లో రాసి పంపాలని ఆజ్ఞ అయింది. రాజైన అహష్వేరోషు పేరట ఆ లేఖికులు తాకీదులు రాశారు. వాటిపై రాజముద్ర వేశారు.

13 అదారు అనే పన్నెండో నెల పదమూడో రోజున యువత మొదలుకుని వృద్ధుల వరకూ, పిల్లలు, స్త్రీలు అనే తేడా లేకుండా యూదులందరినీ ఒక్క రోజే చంపి సమూల నాశనం చేసి వారి సొమ్ము కొల్లగొట్టాలని ఆజ్ఞ రాసి ఉన్న రాజపత్రాలను అంచెల వారీగా వార్తాహరులు రాజ్య సంస్థానాలన్నిటికీ తీసుకు పోయారు.

14 ఆ రోజు కోసం అందరూ సిద్ధంగా ఉండాలని తెలిపే ఆ ఆజ్ఞ తాలూకు ప్రతులు అన్ని సంస్థానాల ప్రజలందరికీ అందజేశారు. 15 వార్తాహరులు రాజాజ్ఞను చేరవేయడానికి చురుకుగా బయలుదేరి వెళ్లారు. ఈ ఆజ్ఞ షూషను కోటలో కూడా ప్రకటించారు.

రాజు, హామాను విందుకు కూర్చున్నారు. షూషను పట్టణం అంతా గందరగోళంగా ఉంది.

Veja também

Publicidade
Ester
Ver todos os capítulos de Ester
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-16_06-50-08-